రేపు మధ్యప్రదేశ్‌లో మోదీ పర్యటన.. దేశంలో మరో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Published : Jun 26, 2023, 01:41 PM IST
రేపు మధ్యప్రదేశ్‌లో మోదీ  పర్యటన.. దేశంలో మరో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే..

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ.. రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి దేశంలో ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీ.. రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి దేశంలో ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు షాహ్‌డోల్‌లో జరిగే బహిరంగ కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరవుతారు. సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డ్‌ల కిక్‌స్టార్ట్ పంపిణీని ప్రారంభిస్తారు. షాదోల్ జిల్లాలోని పకారియా గ్రామాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.

షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ కార్యక్రమంలో ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. అందులో.. రాణి కమలాపతి-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; ఖజురహో-భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; మడ్గావ్ (గోవా)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్; ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్; హతియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 

రాణి కమలాపతి-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. మహాకౌశల్ రీజియన్ (జబల్‌పూర్) నుంచి మధ్యప్రదేశ్ సెంట్రల్ రీజియన్ (భోపాల్)కి కలుపుతుంది. అలాగే.. భేరాఘాట్, పచ్మర్హి, సాత్పురా మొదలైన పర్యాటక ప్రదేశాలు కూడా మెరుగైన కనెక్టివిటీ ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ఈ రైలు దాదాపు ముప్పై నిమిషాల సమయాన్ని ఆదా చేస్తోంది. 

ఖజురహో-భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాల్వా ప్రాంతం (ఇండోర్), బుందేల్‌ఖండ్ ప్రాంతం (ఖజురహో) నుంచి సెంట్రల్ రీజియన్ (భోపాల్)కి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఇది మహాకాళేశ్వర్, మండూ, మహేశ్వర్, ఖజురహో, పన్నా వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రైలు మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలు కంటే దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాల సమయాన్ని ఆదా చేస్తోంది.

మడ్గావ్ (గోవా)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. గోవా మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, గోవాలోని మడ్గావ్ స్టేషన్ మధ్య నడుస్తుంది. రెండు ప్రదేశాలను కలుపుతున్న ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోల్చినప్పుడు.. ఇది ఒక గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కర్ణాటకలోని ముఖ్యమైన నగరాలు.. ధార్వాడ్, హుబ్బల్లి, దావణగెరె‌లను రాష్ట్ర రాజధాని బెంగళూరుతో కలుపుతుంది. ఈ ప్రాంతంలోని పర్యాటకులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ఈ రైలు దాదాపు ముప్పై నిమిషాల సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

హతియా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. జార్ఖండ్, బీహార్‌లకు మొదటి వందే భారత్. పాట్నా, రాంచీల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా.. ఈ రైలు పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు వరంగా మారనుంది. రెండు ప్రదేశాలను కలుపుతున్న ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోల్చినప్పుడు ఇది ఒక గంట ఇరవై ఐదు నిమిషాల ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

షాహ్‌డోల్‌లో ప్రధాని మోదీ.. 
షాహ్‌డోల్‌లో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డులను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. సికిల్ సెల్ వ్యాధి, ముఖ్యంగా గిరిజన జనాభాలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం ఈ మిషన్ లక్ష్యం. 2047 నాటికి సికిల్ సెల్ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ప్రయోగం కీలక మైలురాయిగా నిలుస్తుంది. జాతీయ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించబడిన సంగతి  తెలిసిందే.

ఇది దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, ఉత్తరాఖండ్.వంటి 17 రాష్ట్రాల్లోని 278 జిల్లాల్లో ఇది అమలు చేయబడుతుంది. 

మధ్యప్రదేశ్‌లో దాదాపు 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కార్డుల పంపిణీని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలు, డెవలప్‌మెంట్ బ్లాకుల్లో నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలు 100 శాతం సంతృప్తమయ్యేలా ప్రతి లబ్దిదారునికి చేరువ చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా ఆయుష్మాన్ కార్డు పంపిణీ ప్రచారం ఒక అడుగు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ‘రాణి దుర్గావ‌తి గౌర‌వ యాత్ర’ ముగింపు సంద‌ర్భంగా రాణి దుర్గావ‌తి గౌరవ కార్యక్రంలో పాల్గొంటారు. రాణి దుర్గావతి శౌర్యాన్ని, త్యాగాన్ని ప్రచారం చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ యాత్రను నిర్వహిస్తోంది. రాణి దుర్గావతి.. 16వ శతాబ్దం మధ్యలో గోండ్వానా పాలించే రాణి. ఆమె మొఘల్‌లకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధైర్యవంతురాలు. నిర్భయమైన, ధైర్యవంతమైన యోధురాలు.

పకారియా గ్రామంలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 
ఒక విశిష్ట చొరవలో, ప్రధాన మంత్రి మోదీ..  షాహ్‌డోల్‌జిల్లాలో పకారియా గ్రామాన్ని సందర్శిస్తారు. గిరిజన సంఘం నాయకులు, స్వయం సహాయక బృందాలు, పీఈఎస్‌ఏ [పంచాయత్ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996] కమిటీల నాయకులు, విలేజ్ ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్‌లతో సంభాషిస్తారు. ప్రధాన మంత్రి గిరిజన, జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. అలాగే గ్రామంలో విందు కూడా చేస్తారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్