న్యూస్‌పేపర్ హాకర్లకు రూ. 6 వేల కోవిడ్ ఆర్థిక సాయం.. ప్రకటించిన ఒడిశా సీఎం

By Sumanth KanukulaFirst Published Dec 23, 2021, 5:17 PM IST
Highlights

కోవిడ్ కాలంలో వార్తాపత్రికలను సరఫరా చేయడానికి న్యూస్‌పేపర్ హాకర్లు (వార్తాపత్రికల అమ్మకపుదారులు) ఎంతో కష్టపడ్డారు. కష్టకాలంలో కూడా  newspaper hawker పాఠకుల వద్దకు వార్తపత్రికలను చేర్చారు. 

కరోనా ప్రభావం చాలా రంగాలపై పడింది. పేద, మధ్య తరగతుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. అయితే కోవిడ్ కాలంలో వార్త పత్రికలను సరఫరా చేయడానికి న్యూస్‌పేపర్ హాకర్లు (వార్తపత్రికల అమ్మకపుదారులు) ఎంతో కష్టపడ్డారు. కష్టకాలంలో కూడా  newspaper hawker పాఠకుల వద్దకు వార్తపత్రికలను చేర్చారు. అయితే అలాంటి వారు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒడిశా ప్రభుత్వం తరఫున రూ. 6,000 ఆర్థిక సాయం (Covid Assistance) అందజేయనున్నట్టుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) గురువారం ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకన్న 7వేలకు పైగా హాకర్లకు ప్రయోజనం చేకూరనుంది. 

ఇదిలా ఉంటే.. న్యూస్ పేపర్‌ హాకర్లకు ప్రమాదాలు సంభవిస్తే ఆర్థిక సాయం అందజేస్తామని కూడా చెప్పారు. న్యూస్‌ పేపర్ హాకర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం చెల్లిస్తుందని అన్నారు. ఒకవేళ వైకల్యం ఏర్పడితే.. దాని స్థాయిని బట్టి రూ. 40 వేల నుంచి రూ. 80 వేల వరకు సాయం అందజేయనున్నారు. సహజ మరణం పొందితే వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేయనున్నారు. 

‘వార్త ప్రతికల హాకర్లకు కోవిడ్-19 వేళ సహాయాన్ని అందించే దేశంలోనే మొదటి రాష్ట్రం ఒడిశా. రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు సామాజిక భద్రత బోర్డు (Unorganised Workers Social Security Board) కింద రిజిస్టర్ అయిన దాదాపు 7,300 మంది హాకర్లు ఈ ప్రయోజనాలు పొందుతారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.38 కోట్లు ఖర్చు చేయనుంది’ అని అధికారులు తెలిపారు. 

వార్తాపత్రికలను పంపిణీ చేయడానికి మహమ్మారి సమయంలో హాకర్లు చాలా రిస్క్ చేశారని నవీన్ పట్నాయక్ అన్నారు. వారి కృషిని గుర్తించి అభినందించాలని చెప్పారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా అర్హులైన హాకర్ల డేటా బేస్ రూపొందిస్తున్నామని.. త్వరలోనే ప్రతి లబ్దిదారుడికి గుర్తింపు కార్డు అందజేస్తామని చెప్పారు. 

click me!