
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఎక్కడ చూసినా.. ఈ జంక్ ఫుడ్ కనపడుతోంది. ముఖ్యంగా.. నూనెలో వేయించిన ఫ్రైడ్ ఫుడ్స్ గురించి అయితే.. అసలు చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ ఆహారం విషయంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. దేశం మొత్తం కాదు లేండి. కేంద్ర ఆరోగ్యశాఖ క్యాంటీన్లో తయారయ్యే ఆహారం విషయంలో ఆంక్షలు విధించారు.
క్యాంటీన్లో ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించారు ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఆరోగ్యకరమైన ఆహారాలను అందించేందుకు చర్యలు చేపట్టారు. క్యాంటీన్లో వేయించిన ఆహార పదార్థాలను తొలగించింది ఆరోగ్యశాఖ. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. క్యాంటీన్లో సమోసాలు, బ్రెడ్, పకోడా వంటి వేయించిన ఆహార పదార్థాల స్థానంలో బఠానీలు, ఆరోగ్యకరమైన కూరలు, మిల్లెట్స్, రోటీలు, దాల్ చిల్స్ పెట్టడం గమనార్హం. అందరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దాల్ చిల్స్ రూ.10, ఆల్పాహారం రూ.25, మధ్యాహ్నం భోజనం 40లకు అందుబాటులో ఉంటుంది. మాండవియా ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి క్యాంటీన్కు ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆహార పదార్థాల ఎంపికపై చర్యలు చేపట్టారు.