ఎన్డీఏలో మళ్లీ విభేదాలు: బీజేపీపై జేడీయూ అలక.. అంతా ఎల్‌జేపీ వల్లే

Siva Kodati |  
Published : Jan 31, 2021, 04:06 PM IST
ఎన్డీఏలో మళ్లీ విభేదాలు: బీజేపీపై జేడీయూ అలక.. అంతా ఎల్‌జేపీ వల్లే

సారాంశం

అధికార ఎన్డీయేలో మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలో శనివారం ఎన్డీయే పక్షాల సమావేశం వర్చువల్‌గా జరిగింది

అధికార ఎన్డీయేలో మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలో శనివారం ఎన్డీయే పక్షాల సమావేశం వర్చువల్‌గా జరిగింది.

ఈ భేటీకి లోక్‌ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ చిరాగ్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీని వెనుక జేడీయూ అభ్యంతరాలే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కూటమి భావనను మరిచిపోయి, ఎన్నికల్లో తమను వెన్నుపోటు పొడిచిన పార్టీకి తిరిగి ఆహ్వానం పంపడం ఏంటని జేడీయూ నేతలు బీజేపీపై ఒత్తిడి తెచ్చినట్లుగా సమాచారం. బిహార్‌కే చెందిన ఎన్‌డీఏ పక్షాలు హిందుస్తాన్‌ ఆవామ్‌ మోర్చా, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీలు కూడా ఎల్‌జేపీకి ఆహ్వానం పంపడం ఏంటంటూ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

దీంతో, ఎల్‌జేపీకి పంపిన ఆహ్వానాన్ని బీజేపీ వెనక్కి తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని కమలనాథులు అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల బిహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్‌జేపీ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.

సీఎం నితీశ్‌ సారథ్యంలోని జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎల్‌జేపీ అభ్యర్థులను నిలిపింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎల్‌జేపీ భారీగా ఓట్లను చీల్చడంతో జేడీయూ చాలా స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయింది.

దీంతో తమకు వ్యతిరేకంగా చిరాగ్‌ అభ్యర్థులను బరిలో నిలపడంతో తాము పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయామని జేడీయూ ఆరోపిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని సీఎం నితీష్‌ కుమార్‌ సైతం వ్యక్తం చేశారు. నాటి నుంచి ఎల్‌జేపీ, జేడీయూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu