
UP election result 2022: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ముస్లింలు తప్పుడు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం వల్లే ఆ పార్టీ విజయం సాధించిందని బీఎస్పీ పేర్కొంది. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఉత్తరాఖండ్ ముస్లింలు తప్పుచేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఇటీవల ముగిసన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ దారుణ ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో దాని పనితీరును సమీక్షించేందుకు పార్టీ అధ్యక్షురాలు మాయావతి సమీక్ష నిర్వహించారు. దీనిలో ఉత్తరాఖండ్ యూనిట్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్ మాదిరిగానే, ఉత్తరాఖండ్లో కూడా అధికార పార్టీ బీజేపీని ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశామనీ, అయితే సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడంలో ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు తప్పు చేశారని బీఎస్పీ పేర్కొంది. దీని కారణంగా పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు దాని దురహంకార మరియు నిరంకుశ వైఖరి వంటి సమస్యలపై బీజేపీ పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నప్పటికీ, బిజెపి మళ్లీ లాభపడింది" అని బీఎస్పీ తన ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ వ్యక్తుల వైఖరి మారకపోతే సమస్యను పరిష్కరించడం చాలా కష్టమని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీఎస్పీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మొత్తం ఓట్లలో కేవలం 4.82 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47 సీట్లు గెలుచుకుంది. డబ్బు రాజకీయంతో నే ఆ పార్టీలు ఎన్నికల్లో గెలుపొందాయని ఆరోపించిన మాయావతి... ఎన్నికల ఫలితాలతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని, లోటుపాట్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు.
కాగా, ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధిస్తూ.. మరోసారి అధికార పీఠం దక్కించుకుంది. మొత్తం 70 సీట్లలో 47 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.
ఇదిలావుండగా, ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ.. బీజేపీ విజయానికి ఎంఐఎం, బీఎస్పీలే కారణమంటూ పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే శివసేన నాయకుడు సంజయ్ రౌత్.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'బీజేపీ విజయానికి సహకరించినందుకు' ఇద్దరు నేతలకు పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు తప్పక ప్రదానం చేయాలంటూ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'బీజేపీ ఘన విజయం సాధించింది. యూపీ వారి రాష్ట్రం. అఖిలేష్ యాదవ్ తన సీట్లను 42 నుండి 125కు పెంచుకుంది. అంటే 42 నుండి 125 కి 3 రెట్లు పెరిగాయి. బీజేపీ గెలుపునకు మాయావతి మరియు ఒవైసీలు సహకరించారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాలి”అని అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఇక పంజాబ్లో బీజేపీ వంటి జాతీయవాద పార్టీని పూర్తిగా తిరస్కరించడం ఆందోళన కలిగిస్తోందని రౌత్ అన్నారు.