
లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రి కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నకిలీ కుల ధృవీకరణ పత్రం కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే అంతకుముందు సెప్టెంబర్లో కూడా నవనీత్ రాణా, ఆమె తండ్రికి ఇదే కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే అది ఇంకా అమలు కాలేదు. ఈ వ్యవహారం సోమవారం ముంబై కోర్టులో విచారణకు రాగా.. అమరావతి ఎంపీ రాణా, ఆమె తండ్రిపై వారెంట్ అమలుకు మరింత సమయం కావాలని పోలీసులు కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పీఐ మొకాషి.. నవనీత్ రాణా, ఆమె తండ్రిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ నివేదిక దాఖలు చేసేందుకు కోర్టు తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.
ఇక, ఈ కేసు విషయానికి వస్తే.. ముంబైలోని ములుంద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ప్రకారం.. నవనీత్ రానా, ఆమె తండ్రి కుల ధృవీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ చేసి.. షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన స్థానం నుంచి ఆమె పోటీ చేశారని ఫిర్యాదు నమోదైంది. నవనీత్ రాణా ఆమెకు జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాన్ని కల్పిత పత్రాలను ఉపయోగించి మోసపూరితంగా పొందారని బాంబే హైకోర్టు 2021లో దానిని రద్దు చేసింది.