
గత రెండేళ్లలో ఎక్కువ మంది ముస్లిం యువతులే హిందూ మతాన్ని స్వీకరించి పెళ్లి చేసుకున్నారని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ అన్నారు. కానీ ఈ నిజాన్ని వక్రీకరించి, హిందూ యువతులే ఎక్కువగా మతం మారుతున్నారని ప్రజలకు ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయకూడని అన్నారు. సోమవారం నిర్వహించిన గుజరాత్ శాసన సభ సమావేశాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“ రెండు రోజుల క్రితం మణినగర్లో ఒక ముస్లిం యువకుడు తన హిందూ స్నేహితురాలితో కలిసి ఉన్నారు. ఈ సమయంలో వారిని ఇతర వ్యక్తులు చూసి దారుణంగా కొట్టారు. అయితే ఆ రెండు హిందూ, ముస్లిం కుటుంబాలు సన్నిహితంగా ఉండేవి. ఈ ఘటన దురదృష్టకరమని బాలిక తండ్రి పోలీసులకు తెలిపారు. తండ్రి నుంచి ఈ విధంగా ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు” అని గుజరాత్లో మాబ్-లించింగ్ ఎపిసోడ్ల విషయాన్ని ఎమ్మెల్యే శాసన సభలో మాట్లాడారు.
“ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయడాన్నిగత కొన్నేళ్లుగా చూస్తున్నాం. వార్తా ఛానెల్లు కూడా హిందూ-ముస్లిం చర్చలతో నిండిపోయాయి. వివాహం కోసం మత మార్పిడి చేసుకున్న హిందూ సోదరీమణులతో పోలిస్తే, గత రెండేళ్లలో ఎక్కువ మంది ముస్లిం కుమార్తెలు హిందూ మతాన్ని స్వీకరించి వివాహం చేసుకున్నారు. పోయిన సమావేశాల్లో మంత్రికి ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పాను. సభలో బడ్జెట్ డిమాండ్లపై మాట్లాడుతూ ఇలాంటి అంశాలను వక్రీకరించడం తీవ్రమైన విషయం.’’ అని ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ తెలిపారు.
అయితే మత మార్పిడులకు సంబంధించి ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ మాట్లాడినప్పటికీ.. ఈ వివాహాలకు సంబంధించి ఆయన ఎలాంటి లెక్కలు చెప్పలేదు. “ (రాష్ట్ర) బడ్జెట్లో మైనారిటీలకు కేటాయింపులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. కేటాయించిన సొమ్ము కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. గతేడాది రూ.7,161 లక్షల బడ్జెట్ కేటాయించగా అందులో రూ.22 కోట్లు (రూ. 2,200 లక్షలు) ఖర్చు కాలేదు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.8,058 లక్షలు కేటాయించింది. అయితే ఇది అని మైనారిటీల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే అది చాలా తక్కువ ’’ అని ఎమ్మెల్యే తెలిపారు. ‘‘ ఇప్పటికైనా మైనారిటీ సంక్షేమం కోసం తగినన్ని నిధులు కేటాయించి, వాటిని సరిగా ఖర్చు చేయాలని గుజరాత్ మైనారిటీ మంత్రిత్వ శాఖను మేము డిమాండ్ చేస్తున్నాము ’’ అని అన్నారు.