మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రతరం.. ముంబై-బెంగళూరు హైవే దిగ్బంధం, రైళ్లు నిలిపివేత

Published : Oct 31, 2023, 05:02 PM IST
మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రతరం.. ముంబై-బెంగళూరు హైవే దిగ్బంధం, రైళ్లు నిలిపివేత

సారాంశం

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతంగా మారింది. నిరసనకారులు  ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటల పాటు దిగ్బంధించారు. దీంతో కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. రైల్వే ట్రాక్ లపై కూడా ఉద్యమకారులు నిరసన చేపట్టారు.

ఓబీసీ కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో మరాఠా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని మరాఠా కమ్యూనిటీ సభ్యులు చేపడుతున్న ఆందోళన మంగళవారం తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. ఆందోళనకారులు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటల పాటు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరువైపులా రద్దీ నెలకొంది.

ఈ నిరసనలో భాగంగా మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు సోలాపూర్ లో రైల్వే ట్రాక్ లను దిగ్బంధించారు. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు రైల్వే పట్టాలపై టైర్లు తగలబెట్టారు. కాషాయ జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. దీంతో రైల్వే అధికారులు, షోలాపూర్ సిటీ పోలీసులు రామ్ జాదవ్, నిషాంత్ సాల్వే అనే ఇద్దరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చి, ట్రాక్ ను క్లియర్ చేశారని ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది.

ఇదిలావుండగా.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో నిరసన తెలుపుతున్న కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారు. ‘ఏక్ మరాఠా లక్ మరాఠా' నినాదంతో మద్దతుదారులు సోమవారం రాత్రి జిల్లాలోని ఘన్సవాంగిలోని పంచాయతీ సమితి కార్యాలయానికి చేరుకుని ఆస్తులను తగలబెట్టి ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రెండు గదుల్లోని కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫర్నీచర్ ధ్వంసమైనట్లు ఘన్సావంగి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

జల్నాలో జరిగిన మరో ఘటనలో మరాఠా సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు సోమవారం మధ్యాహ్నం బద్నాపూర్ తహసీల్ లోని షెల్గావ్ గ్రామంలోని రైల్వే గేటు వద్ద రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. కాగా.. మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే రిజర్వేషన్ డిమాండ్ కు మద్దతుగా జల్నా జిల్లాలోని అంతర్వాలీ సారతి గ్రామంలో అక్టోబర్ 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మరాఠా కోటా సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పనిచేస్తోందని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఈ నిరసనను కొందరు సద్వినియోగం చేసుకుని హింసను వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. బీడ్ లో ప్రజాప్రతినిధుల ఇళ్లు, హోటళ్లు, వాహనాలు, ప్రభుత్వ సంస్థలు దగ్ధమయ్యాయని, ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. నిందితులపై హోంశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, సీసీటీవీ ఫుటేజీల ద్వారా కనీసం 50 నుంచి 55 మంది నిందితులను గుర్తించామని ఫడ్నవీస్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 307ను అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. అలజడులు సృష్టించే వారిని సహించేది లేదని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu