
బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బు సుందర్ను కీలక పదవి వరించింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమె నామినేట్ అయ్యారు. తమిళనాడుకు చెందిన ఖుష్బుతో పాటు జార్ఖండ్కు చెందిన మమతా కుమారి, మేఘాలయకు చెందిన డెలినా ఖోంగ్ డుప్లను కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ చేసింది. వీరు ఎన్సీడబ్ల్యూలో సభ్యులుగా.. బాధ్యతలు చేపట్టిన మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరక కొనసాగనున్నారు.
తనను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ చేయడంపై ఖుష్బు హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద బాధ్యతను తనకు అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత ప్రభుత్వానికి ఖుష్బు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నారీ శక్తిని పరిరక్షించడానికి, సంరక్షించడానికి తాను తీవ్రంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా పేర్కొన్నారు.
మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ ఖుష్బు నామినేట్ కావడంతో.. ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యునిగా నామినేట్ అయినందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బుకు తమిళనాడులోని పార్టీ యూనిట్ తరఫున అభినందనలు తెలుపుతున్నట్టుగా తమిళనాడు బీజేపీ యూనిట్ చీఫ్ అన్నామలై పేర్కొన్నారు.