భారత్ లో కరోనా విజృంభణ..4వేలు దాటిన మరణాలు

By telugu news teamFirst Published May 25, 2020, 10:31 AM IST
Highlights

కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో 138,845 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4 లో కొన్ని సడలింపులు. చేయడంతో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,38,845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం దేశంలో ఈ కరోనా వైరస్ కారణంగా 4వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం

ఇప్పటి వరకు 57,721 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4021 మంది మృతి చెందారు. అటు 77,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో 138,845 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలు ఆ తర్వాత ఉన్నాయి.

కోయంబేడు లింకులతో తమిళనాడులో కరోనా రక్కసి తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో మ‌హారాష్ట్ర అత్యధికంగా 50 వేలు పైచిలుకు కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు 16,277 పాజిటివ్ కేసులు, 111 మరణాలతో రెండో స్థానంలోకి చేరింది. మొన్న‌టి వ‌ర‌కు గుజ‌రాత్ అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు త‌మిళ‌నాడు గుజ‌రాత్ స్థానాన్ని ఆక్ర‌మించేసింది. 

అటు గుజ‌రాత్‌లోనూ కోవిడ్‌-19 భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 858 మంది ప్రాణాలు విడిచారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా విలయం సృష్టిస్తోంది. అక్కడ 13,418 పాజిటివ్ కేసులు 261 మరణాలు సంభవించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ ఎక్కువగానే ఉంది. తెలంగాణలో ప్రతి రోజూ 50కి తక్కువ కేసులు నమోదు కావడం లేదు. 

click me!