
Faridabad: మహిళను వేధించారని ఇద్దరు వ్యక్తులపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గురుగ్రామ్ పరిధిలోని ఫరీదాబాద్ గ్రామంలో గురువారం రాత్రి 32 ఏళ్ల వ్యక్తిని ఓ మహిళ కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. అతని స్నేహితుడిపై కూడా కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తి ప్రస్తుం ఢిల్లీ ఆసుపత్రిలో చికత్స పొందుతూ ప్రాణాలు నిలుపుకోవడం కోసం పోరాడుతున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో మోహిత్, అతని స్నేహితుడు నవీన్ కారులో తాగుతుండగా భూపానీలో 28 ఏళ్ల యువతి కుటుంబ సభ్యులు, బంధువులు వారిని చుట్టుముట్టారు.
కర్రలు, రాడ్లు, గొడ్డళ్లతో సాయుధులైన మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు కారు అద్దాలను పగులగొట్టి, వారిద్దరినీ బయటకు లాగి, వారిపై దెబ్బల వర్షం కురిపించడం ప్రారంభించారు. ఇద్దరు స్నేహితులు మహిళను వేధించారని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జోక్యం చేసుకునే వరకు వారు ఇద్దరినీ కొడుతూనే ఉన్నారు. ఈ ఘటనకు ఒక గంట ముందు, మోహిత్, నవీన్ లపై వేధింపుల ఫిర్యాదు చేయడానికి మహిళ, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు ఫిర్యాదును నమోదు చేస్తుండగా, మోహిత్, నవీన్ తమ ఇంట్లోకి చొరబడ్డారనీ, అక్కడున్న వారిని బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులలో ఒకరికి పొరుగువారి నుండి కాల్ వచ్చింది. వారు వెంటనే పోలీసు స్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరారు.
సమాచారం తెలిసిన పోలీసులు సైతం వారి వెనుకనే వచ్చారు. అయితే, వారు ఇంటికి చేరుకునే సమయానికి బెదిరింపులకు పాల్పడిన ఇద్దరూ వెళ్లిపోయారు. ఇంతలో భూపానీ సమీపంలో మోహిత్, నవీన్ లపై మహిళ బంధువులు దాడి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, దాడి చేసినవారు పారిపోయారు. అప్పటికే వారిని తీవ్రంగా కొట్టారు. వారిద్దరిని బీకే ఆసుపత్రికి తరలించారు. అయితే, దాడి జరిగిన ఘటన స్థలిలోనే మోహిత్ మరణించినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో నవీన్ ను ఢిల్లీ ఆసుపత్రికి తరలించారు.
కాగా, మోహిత్ కు నేరచరిత్ర ఉందనీ, అతనిపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన తర్వాత మహిళ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులపై భూపానీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాలుపంచుకుని పరారీలో ఉన్నవారి కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి 20 ఏళ్ల యువకుడిని శుక్రవారం అరెస్టు చేశారు. ఇతరుల కోసం మేము వివిధ ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఒక వ్యక్తిని అరెస్టు చేసి ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.