తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
09:30 PM (IST) Aug 12
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై ఆగంతకులు దాడి చేశారు. శుక్రవారం పశ్చిమ న్యూయార్క్లో ఆయన ఉపన్యాసం ఇవ్వబోతుండగా ఆగంతకుండు స్టేజీ మీదే సల్మాన్ను కత్తితో పొడిచాడు. దీంతో ఆయన వెంటనే నేలపై పడిపోయాడు. హుటాహుటిన స్పందించిన నిర్వాహకులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
08:46 PM (IST) Aug 12
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా విశాఖలో ఈ నెల 14 నుంచి అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. 14 నుంచి 31 వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఇందుకోసం దాదాపు 60 వేల మందికి పైగా అభ్యర్ధులు నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
08:17 PM (IST) Aug 12
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. వీటిని పూడ్చేందుకు గాను అధికారులు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. రాఖీ పౌర్ణమి, పైగా వారాంతం కావడంతో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. అబ్దుల్లాపూర్మెట్ నుంచి తుప్రాన్ గేట్ సమీపం వరకు మరమ్మత్తుల కారణంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
07:29 PM (IST) Aug 12
నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతను మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఆగస్ట్ 21వ తేదీన వున్న డెడ్లైన్ను సుప్రీంకోర్ట్ 28కి పొడిగించింది. సెప్టెంబర్ 4 నాటికి కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
06:36 PM (IST) Aug 12
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వంలో అత్యధిక మంది మంత్రులకు నేరచరిత్ర వున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. దాదాపు 75 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు వున్నట్లు తెలిపింది. 13 మంది మంత్రులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు వున్నట్లు పేర్కొంది. అలాగే మంత్రి వర్గంలోని వారంతా కోటీశ్వరులేనని ఏడీఆర్ తెలిపింది.
05:57 PM (IST) Aug 12
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆయన అక్కచెల్లెళ్లు రాఖీ కట్టి దీవించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రాకతో ప్రగతి భవన్లో పండుగ వాతావరణం నెలకొంది.
05:03 PM (IST) Aug 12
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసేవరకు అంటే ఆగస్ట్ 15వరకు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అస్సాంలో పర్యటించవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. స్వతంత్య్ర వేడుకల నుండి ప్రజల దృష్టి మరలకుండే వుండేందుకూ అమీర్ ను అస్సాం రావద్దని కోరుతున్నానని... ఆయన తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అస్సాం సీఎం కోరారు.
04:10 PM (IST) Aug 12
నేడు దేశీయ స్టాక్ మార్కెట్స్ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 59,462 వద్ద, నిప్టీ 39 పాయింట్ల లాభంతో 17,698 వద్ద ముగిసాయి.
03:00 PM (IST) Aug 12
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధానిరేసులో వుంటారన్న ప్రచారంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. తనకు తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదను కానీ ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఉమ్మడిగా వుండేందుకు కీలకపాత్ర పోషిస్తానని అన్నారు.
02:05 PM (IST) Aug 12
యమునా నదిలో పడవ బోల్తా ప్రమాదాన్ని మరిచిపోకముందే ఉత్తర ప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బారాబంకి జిల్లా రామ్ నగర్ పట్టణ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ప్రభుత్వ బస్సు ఓ ట్రక్ ను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యింది. ట్రక్ ను బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడగా వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను లక్నోలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
12:42 PM (IST) Aug 12
జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుకు గురయిన ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. గుండెపోటుతో ఇప్పటికే డిల్లి ఎయిమ్స్ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రాజు మెదడు కూడా దెబ్బతిన్నట్లు డాక్టర్లు తెలిపారు.
11:33 AM (IST) Aug 12
గురువారం సాయంత్రం గుజరాత్ లో ఓ కారు బీభత్సం సృష్టించి ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. అయితే ఈ కారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడిదిగా గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా గ్రామ సమీపంలో అతివేగంతో దూసుకొచ్చిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (SUV) ఓ ఆటోరిక్షా, బైక్ ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళతో పాటు మొత్తం ఆరుగురు మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే మేనల్లుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
10:51 AM (IST) Aug 12
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే యుమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా శనివారం నాటికి ఈ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని అధికారులు హెచ్చరించారు. అంతకంతకు యమునా ప్రవాహం పెరుగుతోందని... గురువారం రాత్రి 8గంటల వరకు 204.20 మీటర్లకు నీటి ప్రవాహం చేరుకుందని అధికారులు వెల్లడించారు. కాబట్టి డిల్లీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు.
10:35 AM (IST) Aug 12
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుమధ్యలోని డివైడర్ ను ఢీకొంది. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది.
09:39 AM (IST) Aug 12
రక్షాబంధన్ రోజున గుజరాత్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. సోదరులకు రాఖీ కట్టి వెళుతున్నవారిని ఓ కారు ఢీకొట్టడంతో మృతిచెందారు. ఆనంద్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆటో రిక్షాతో పాటు బైక్ ను కారు ఢీకోట్టడంతో ఆరుగురు మృతిచెందారు.
09:24 AM (IST) Aug 12
కృష్ణా నదిలో వరదనీటి ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ఎగువన పులిచింతల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో 3.37 క్యూసెక్కులుగా వుంది.