Humsafar Express Train Fire: గుజరాత్లోని వల్సాడ్ లో హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం (సెప్టెంబర్ 23) మంటలు చెలరేగాయి. ఈ రైలు తిరుచిరాపల్లి - శ్రీ గంగానగర్ మధ్య నడుస్తోంది. ఈ ఘటన గుజరాత్లోని వల్సాద్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాంతంలో రైల్ లోని పవర్ కార్/బ్రేక్ వ్యాన్ కోచ్లో మంటలు చెలరేగాయి.
అధికారులు అప్రమత్తమై.. పక్క బోగీల్లోని ప్రయాణికులందర్నీ వెంటనే రైలులో నుంచి దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో మంటలకు వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరగడంతో గందరగోళం నెలకొంది. అయితే.. ఈ సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
రైల్వేశాఖ ఏం చెప్పింది?
ఈ ఘటనపై పశ్చిమ రైల్వేకు చెందిన CPRO సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. "రైల్ నంబర్ 22498 పవర్ కార్/బ్రేక్ వ్యాన్ కోచ్లో మంటలు చేలారేగాయి. ఈ పరిస్థితిని గమనించిన లోకో ఫైలెట్ రైలును వెంటనే నిలిపివేశాడు. కోచ్లోని ప్రయాణికులందరినీ వెంటనే సురక్షితంగా దించేశారు. ఈ ప్రమాదంవల్ల ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం తెలియరాలేదు. త్వరలోనే ఆ కోచ్ను రైలు నుంచి వేరు చేసి.. వీలైనంత త్వరగా సేవలను పునరుద్దిస్తాం . తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు వల్సాద్ స్టేషన్ నుండి సూరత్ వైపు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరిన వెంటనే జనరేటర్ లో మంటలు చెలరేగాయి "అని తెలిపారు.
అగ్ని ప్రమాదానికి కారణమేమిటి?
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి బి1 కంపార్ట్మెంట్కు వ్యాపించాయని పోలీసు సూపరింటెండెంట్ కరణరాజ్ వాఘేలా మీడియాకు తెలిపారు. వెంటనే మంటలు అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, రైలును నిలిపివేసి, ప్రయాణికులందరూ భద్రత కోసం రైలు నుంచి దిగిపోయారని అధికారులు తెలిపారు.