
కార్లలో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మాస్క్ (masks) ధరించడం తప్పనిసరి చేస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ (delhi) ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించుకుంది. కోవిడ్ (covid) ఆంక్షలను సమీక్షించేందుకు నేడు దేశ రాజధానిలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ddma) సమావేశం నిర్వహించింది. డ్రైవింగ్ (driving) చేసే వ్యక్తి ఒక్కరే కార్లో ఉంటే మాస్క్ (masks) తప్పని సారి కాదు అని తెలిపింది.
కార్లలో మాస్కు వాడకం విషయంలో గతంలో ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇటీవల హై కోర్టు కూడా తప్పు పట్టింది. ఆ నిర్ణయం ‘‘అసంబద్దం’’ అని పేర్కొంది. సొంత కార్లో కూర్చుకున్నప్పుడు, అతను ఒక్కడే కార్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మాస్క్ ఎందుకు ధరించాలి. దీనిని ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకోకూడదు అని సూచించింది. అయితే ఈ విషయంతో పాటు పరిగణలోకి తీసుకున్న డీడీఎంఏ తన నిర్ణయాన్ని సవరించుకుంది. ఇప్పటి నుంచి ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. కార్లో ఒక్కరే ఉన్న సమయంలో మాస్క్ ధరించకపోయినా ఫైన్లు విధించకూడదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలో దశల వారీగా పాఠశాలలను తెరవాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ddma) శుక్రవారం నిర్ణయించింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9- 12వ తరగతులు కొనసాగుతాయని చెప్పింది. ఉన్నత విద్యా సంస్థలు కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రతీ టీచర్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. లేకపోతే పాఠశాలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా, నైట్ కర్ఫ్యూ మాత్రం అమలు చేయాలనే నిర్ణయించుకుంది. కానీ, కొంత మార్పు చేసింది. ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు అవుతున్నది. వచ్చే సోమవారం నుంచి ఈ నైట్ కర్ఫ్యూ రాత్రి 11 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా కరోనా (corona) కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కరోనాపై సమీక్ష జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం కేంద్ర ప్రభుత్వం దేశంలో టెస్ట్ పాజిటివిటీ రేటు పెరుగుతుందని తెలిపిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,49,394 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,52,712కు చేరింది. కొత్తగా 2,46,674 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ రివకరీల సంఖ్య 4,00,17,088కి పెరిగింది. ప్రస్తుతం 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ 1,072 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,00,055కు పెరిగింది.
జనవరి 13వ తేదీన ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఒకే రోజులో కేసుల సంఖ్య 28,867 చేరింది. తరువాత రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనవరి 14న నగరంలో పాజిటివిటీ రేటు 30.6 శాతం నమోదైంది. ఈ థర్డ్ వేవ్ లో ఈ పాజిటివిటీ రేటే అత్యధికం. అయితే పది రోజుల వ్యవధిలో రోజు వారి కేసుల సంఖ్య 10 వేలకు పడిపోయింది.