
Boy falls into borewell : పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. అవి వారి ప్రాణాలను మింగేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా.. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మార్పురావడం లేదు. వాటిని వూడ్చకుండానే వదిలేస్తున్నారు. అది గమనించని చిన్నారులు.. సరదాగా ఆడుకుంటూ వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి సందర్భంలో చిన్నారుల ప్రాణాలను కాపాడినా ఘటనల కంటే.. అధిక శాతం ప్రాణాలు కోల్పోయిన ఘటనలే ఉన్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
వివరాల్లోకెళ్తే.. చత్తీస్గఢ్లోని చంపా జిల్లాలోని పిహ్రిద్ గ్రామంలో ఓ 10 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయిన దురదృష్టకర సంఘటన జరిగింది. ఆడుకంటుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కలా వెతికారు. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు. గ్రామస్థుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టింది.
బోరు బావి దాదాపు 80 అడుగుల లోతులో ఉండగా.. పిల్లవాడు 50- 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. పిల్లవాడు పడి దాదాపు 13 గంటలు కావస్తుంది. పిల్లవాడిని రక్షించేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయి. సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయకచర్యలు ముమ్మరం చేశారు. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలంలో చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. భూమిని 50 అడుగుల లోతు వరకు తవ్వారని, ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు 60-65 అడుగుల తర్వాత సొరంగం తవ్వేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
సిఎం భూపేష్ బఘెల్ ఈ ఘటనపై స్పందించారు. పిల్లవాడిని సురక్షితంగా బయటకు తీయాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితులను నిరంతరం అప్డేట్ చేయాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్) బృందాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి