అనూహ్యంగా చంద్రయాన్ ప్రయోగానికి బ్రేక్

Published : Jul 15, 2019, 06:33 AM IST
అనూహ్యంగా చంద్రయాన్ ప్రయోగానికి బ్రేక్

సారాంశం

జీఎస్‌ఎల్వీ మార్క్‌3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. 

శ్రీహరికోట: చంద్రయాన్ - 2 ప్రయోగం అనూహ్యంగా వాయిదా పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రయోగం ఆగిపోయినట్లు తెలుస్తోంది. బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ మార్క్‌3 ఎం1 ద్వారా అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే, సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌-2ను ప్రయోగించేందుకు ముహూర్తం నిర్ణయించారు.

జీఎస్‌ఎల్వీ మార్క్‌3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపేశారు. 

ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్‌-1 ద్వారా తొలి ప్రయత్నంలోనే జాబిల్లి కక్ష్యకు ఆర్బిటర్‌ను ఇస్రో విజయవంతంగా చేరవేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌తోపాటు అక్కడి ఉపరితలంపై దిగే ల్యాండర్‌, రోవర్లు ఉన్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 6.51 గంటలకు షార్‌లో కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.
 
చంద్రయాన్‌-2లో మొత్తం 13 పేలోడ్స్‌ ఉన్నాయి. ఆర్బిటర్‌లో 8, విక్రమ్‌ ల్యాండర్‌లో 3, ప్రగ్యాన్‌ రోవర్‌లో 2 ఉన్నాయి. వీటిల్లో ఐదు పేలోడ్స్‌ మన దేశానికే చెందినవి కాగా మూడు యూరప్‌, రెండు అమెరికా, ఒకటి బల్గేరియా దేశానికి చెందినవి. ఈ ప్రయోగానికి ఇస్రో రూ.978 కోట్లు ఖర్చు చేస్తోంది. రూ.375 కోట్లతో రాకెట్‌ను, రూ.603 కోట్లతో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్లను ఇస్రో తయారు చేసింది.
 
చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆదివారం సాయంత్రమే షార్‌కు చేరుకున్నారు. ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌, డైరెక్టర్‌ రాజరాజన్‌ ఆర్ముగం, కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాట ఎన్నికలు కమలహాసన్ కీలక సందేశం in Tamil Nadu Elections | Asianet News Telugu
కేరళ త్రిస్సూర్‌లో భారీ పేలుడు 40 మందికి పైగా | Massive Explosion in Kerala | Asianet News Telugu