ఇంటికి పంపిస్తామని నమ్మించి.. యువతిపై సామూహిక అత్యాచారం

By telugu news teamFirst Published Jun 16, 2020, 10:21 AM IST
Highlights

జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని మాయమాటలు చెప్పి బాలికను ముగ్గురు యువకులు తీసుకువెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న 16 ఏళ్ల అమ్మాయిని స్వస్థలమైన జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామంటూ మాయమాటలు చెప్పిన ముగ్గురు యువకులు ఆమెను తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన జరిగింది. 

ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న 16 ఏళ్ల అమ్మాయి తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వేస్టేషనుకు వచ్చింది. పనిఅమ్మాయి అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వేస్టేషనుకు చేరుకుంది. జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని మాయమాటలు చెప్పి బాలికను ముగ్గురు యువకులు తీసుకువెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. 

అనంతరం బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత బాలికను రోడ్డుపై వదిలేశారు. బాలిక అనుమానాస్పదంగా మత్తులో జోగుతూ నడుస్తుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ గమనించి ఆమెను పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. 

మహిళాపోలీసులు ప్రశ్నించగా బాలిక సామూహిక అత్యాచారం గురించి చెప్పింది. దీంతో బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. 

click me!