
కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల వేళ ఓటర్ల బెదిరిస్తూ.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. ముస్లిం ఓటర్లను బెదిరించారు.
ఈ ఎన్నికల్లో ముస్లింలు తనకే ఓటు వేయాలని.. ఒకవేళ వేయకపోతే.. ఒక ప్రజాప్రతినిధిగా తనవైపు నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందవని స్పష్టం చేశారు. కాగా.. బెదిరిచినట్లుగా ఉన్న ఆమె కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపాయి.
ముస్లింల ఓట్లు లేకుండా లభించే గెలుపు తనకు సంతోషానివ్వదంటూనే...తనకు ఓటు వేయాలో లేదో నిర్ణయించుకోవాలన్నారు. అలాగే తనకు ఓటు చేయని ముస్లింలకు తానెలా సాయం చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్కు దిగారు. ఓటు వేయని ముస్లిం ఓటర్ల వివరాలు తనకు తెలిసి పోతాయనీ ఈ నేపథ్యంలో వారికందాల్సిన సహాయం ఆధారపడి వుంటుందంటూ సభాముఖంగానే హెచ్చరించారు.
మరి ఈ కామెంట్స్ పై మేనకా గాంధీ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి. కాగా ఈ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి అక్కడ ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె ఆరుసార్లు గెలుపొందిన పిలిభిత్లో ఇప్పుడు ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు