పశ్చిమ బెంగాల్లో ప్రచారాన్ని ఒక రోజు ముందుగా ముగించాలన్ని ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు అండగా నిలిచిన ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు
పశ్చిమ బెంగాల్లో ప్రచారాన్ని ఒక రోజు ముందుగా ముగించాలన్ని ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనకు అండగా నిలిచిన ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
టీఎంసీకి, బెంగాల్ ప్రజలకు మద్ధతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఏపీ సీఎం చంద్రబాబు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్, ఇతర విపక్ష నేతలకు ధన్యవాదాలు... బీజేపీ అదేశాలతోనే ఎన్నికల సంఘం పక్షపాత చర్యలకు పాల్పడుతోంది.. ఇది ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేసినట్లే.. దీనికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఆరు విడతల పోలింగ్లో పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరగడం, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై టీఎంసీ, లెఫ్ట్ కార్యకర్తలు దాడికి దిగడంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల ప్రచారాన్ని గురువారం రాత్రి 10 గంటలతో ముగించాలని ఈసీ ఆదేశించింది. సాధారణంగా పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు ప్రచారం ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఏడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగించాల్సి ఉంది... ఆందోళనల దృష్ట్యా ఒక రోజు ముందుకు జరిపారు. అయితే ఈసీ తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి ఎన్నికల సంఘం పనిచేస్తుందని బీఎస్పీ మాయావతి ధ్వజమెత్తగా.. ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయిందని కాంగ్రెస్ ఆరోపించింది.