
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ తన చాటాలని చూస్తోంది. అందుకోసం ఆప్ ఎంపీ అభ్యర్ధులతో కలిసి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. ఇలా గెలుపే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళుతున్న సమయంలో ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిల్లీలో లోక్ సభ పోలింగ్ కు మరో రోజు మాత్రమే మిగిలున్న సమయంలో ఆప్ ఎంపీ అభ్యర్ధి కొడుకొకరు అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశాడు.
ఆప్ అధినేత, డిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంపీ సీట్లను అమ్ముకున్నట్లు దక్షిణ డిల్లీ ఆప్ ఎంపి అభ్యర్థి బల్బీర్ సింగ్ జకర్ తనయుడు ఉదయ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. అందులో భాగంగా తన తండ్రి వద్ద కూడా రూ.ఆరు కోట్లు వసూలు చేశాకే కేజ్రీవాల్ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని తెలిపారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ మాట్లాడుతూ...'' మా నాన్న మూడు నెలల క్రితమే ఆప్ లో చేరాడు. ఇలా చేరగానే ఎంపీ టికెట్ కావాలని కోరగా కేజ్రీవాల్ ఆరుకోట్లు డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని చెల్లించిన వెంటనే మా నాన్నను దక్షిణ డిల్లీ నుండి ఆప్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. డబ్బులు చెల్లించినట్లు కూడా తనవద్ద ఆధారాలున్నాయి'' అని వెల్లడించాడు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆప్ లో అలజడి మొదలయ్యింది. తమపార్టీ ఎంపీ అభ్యర్థి తనయుడే ఇలా ఆరోపణలు చేయడంతో ఆప్ అధినాయకత్వం ఇరకాటంలో పడింది. పోలింగ్ ముందు రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం డిల్లీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చింది.