ప్రముఖ రచయిత అత్తలూరి నరసింహారావు కన్నుమూత

By telugu teamFirst Published Sep 14, 2021, 8:57 AM IST
Highlights

ప్రముఖ తెలుగు రచయిత అత్తలూరి నరసింహా రావు కన్నుమూశారు. ఆయన మృతికి సాహితీలోకం సంతాపం వ్యక్తం చేస్తోంది. అత్తలూరి నరసింహారావు విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేశారు.

హైదరాబాద్: ప్రముఖ తెలుగు రచయిత అత్తలూరి నరసింహా రావు కన్నుమూశారు. నిరసన కవుల్లో ఆయన ఒకరు. ఆయన 1946లో జన్మించారు. కవి, రచయిత, అనువాదుకుడిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలంయలో ఆయన అధ్యాపకుడిగా పనిచేశారు. 

విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన రాసిన నిద్ర అనే కథకు కరీంనగర్ నుంచి వెలువడే విద్యుల్లత పత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఆయన భార్య టి. పద్మిని సంగీత విద్వాంసురాలు. ఆమె విణావాదనలో విశాఖపట్నం ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల్లో ఏ గ్రేడ్ కళాకారణిగా పనిచేశారు. 

పద్మిని 2019 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. ఈ దంపతులకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. సాహిత్య రంగంలో ప్రతిభామూర్తులు, నేనేందుకు రాస్తున్నానను, చలంగారి ఉత్తరాలు, రావిశాఖీయం అనే రచనలు చేశారు. నేనెందుకు రాస్తున్నాను అనే రచనకు ఆయన 1980లో భమిడిపాటి రామగోపాలంతో కలిసి పులుపుల వెంకటశివయ్య సాహితీ పురస్కారం అందుకున్నారు. 

భమిడిపాటి జగన్నాథ రావు, కె.కె. రామయ్యలతో కలిసి త్రిపుర ఓ జ్ఞాపకం అనే గ్రంధానికి సంపాదకత్వం వహించారు. తుమ్మల పద్మినితో కలిసి నాకూ ఉంది ఒక కల అనే గ్రంథాన్ని అనువాదం చేశారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ రాసిన పుస్తకానికి స్వరాజ్యం పేరు మీద స్వేచ్ఛానువాదం చేశారు. అతను అమె అందరము, ఇంకానా, దారి, నిద్ర, రాళ్లు, వీడ్కోలు అనే కథలు రాశారు. 

click me!