జూలైలో జాతీయ బంజారా సాహిత్య సమ్మేళనం - బంజారా సాహిత్య అకాడమి

By SumaBala BukkaFirst Published Jun 5, 2023, 2:23 PM IST
Highlights

ఉస్మానియా యూనివర్సిటిలో  నిన్న సాయంత్రం బంజారా సాహిత్య అకాడమీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదవండి : 

ఉస్మానియా యూనివర్సిటిలో  నిన్న సాయంత్రం బంజారా సాహిత్య అకాడమీ కార్యవర్గ సమావేశం జరిగింది. బంజారా సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఏఐబిఎస్ జాతీయ అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్, మహారాష్ట్ర స్టేట్ కోఆర్డినేటర్ మనోహర్ చౌహన్, బంజారా రచయిత మూడ్ కృష్ణ నాయక్ చౌహన్  విశ్రాంత కమ్మర్సియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్, బంజారా సాహిత్య అకాడమీ కన్వీనర్ డా. ధనంజయ్ నాయక్, బంజారా సాహిత్య సంఘ్, మహారాష్ట్ర స్టేట్ కోఆర్డినేటర్ మనోహర్ చౌహన్, కార్యవర్గ సభ్యులు బంజారా యువ రచయిత రమేశ్ కార్తీక్ నాయక్, డాక్టర్ భూక్య రాజారాం నాయక్, డాక్టర్ రవితేజ తదితరులు పాల్గొని భవిష్యత్తులో బంజారా సాహిత్య పరిరక్షణ కొరకు చేపట్టబోయే కార్యక్రమాలను గురించి విస్తృతంగా చర్చించారు. 

మహారాష్ట్రలో బంజారా సాహిత్య సంఘ్ గత పది సంవత్సరాలుగా బంజారా సాహిత్య పరిరక్షణకు, అభివృద్ధికి పాటుపడుతున్నదని, అదే విధంగా తెలంగాణా రాష్ట్రంలో బంజారా సాహిత్య పరిరక్షణకు, అభివృద్ధికి బంజారా సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని డా. ధనంజయ్ నాయక్ పేర్కొన్నారు. భారత దేశమంతటా నివసిస్తున్న బంజారాల భాష కనుమరుగు కాకుండా పరిరక్షించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా బంజారా మేధావులు, రచయితలూ కృషి చేయడం అభినందనీయమని అమర్ సింగ్ తిలావత్ అన్నారు. బంజారా సాహిత్య అకాడమీ చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు.

జూలై నెలలో తెలంగాణ బంజారా సాహిత్య అకాడమీ,  మహారాష్ట్ర బంజారా సాహిత్య సంఘ్,  సంయక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి “బంజారా సాహిత్య సమ్మేళనం” నిర్వహించాలని మనోహర్ చౌహన్ ప్రతిపాదించగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కార్యక్రమ నిర్వహణ వివరాలు త్వరలో తెలియచేయడం జరుగుతుందని సభాధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్ తెలిపారు.

click me!