ఘనపురం దేవేందర్ కవిత : ప్రజలు గెలవాలి

Published : Nov 27, 2023, 12:51 PM IST
ఘనపురం దేవేందర్ కవిత :   ప్రజలు గెలవాలి

సారాంశం

ఓట్లను నోట్లు కమ్మేసి మత్తులో ముంచేసే కాలంలో  'ప్రజలు గెలవాలి ' అంటూ నిజామాబాద్ నుండి ఘణపురం దేవేందర్ రాసిన కవిత ఇక్కడ చదవండి : 

ఓట్ల సమయం వచ్చింది
వాగ్దానాల గేట్లు తెరుచుకున్నాయి
అబద్ధాలు అందంగా చెక్కబడి 
ప్రదర్శనలో పెట్టబడ్డాయి
ఓటర్ లోని ఆశను ఆకర్షించేందుకు
ఉచిత అయస్కాంతాలు కసరత్తు చేస్తున్నాయి
ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు
ఉద్వేగాల వలలు పరుచబడ్డాయి
ఎన్నికలంటే ఒకరి క్షేమం కాదు
జాతి క్షేమం

ఇప్పుడు
మచ్చలేని నాయకులు మచ్చుకైనా దొరకరు
తరతరాల కోసం ఆస్తులు సంపాదించుకునేవాళ్లు తప్ప
ముందుతరం కోసం పనిచేసే నాయకులు అరుదైన కాలం
ఆత్మాభిమానాలు ఆత్మహత్య చేసుకునే కాలం
ఆత్మవిశ్వాసాల అడ్రస్ గల్లంతయై
పౌరుషాల కోరలు పీకేసే కాలం
విద్వేష వ్యూహాలకు పదును పెట్టి
నది లాంటి భాషను వదిలి
మురికి కాలువ లాంటి
తిట్లజలంలో జలకాలాడే కాలం
ఓట్లను నోట్లు కమ్మేసి మత్తులో ముంచేసే కాలం
ఓటర్లను ఒకవైపు నుంచి మతం 
మరో వైపు  కులం కుళ్ళబొడిచే కాలం

ఓట్లను అనుచిత ఉచితాలు కొల్లగొట్టే కాలం
ఓట్లను సర్వేలు మాయ చేసే కాలం
ఓటరు సింహాన్ని
చైతన్యం ముసుగు కప్పుకున్న
సోషల్ మీడియా నక్కలు వంచించే కాలం
అకారణ శత్రువులు బుసలు కొట్టేందుకు అనువైన కాలం
ఏమరిస్తే అస్తిత్వ పడవకు చిల్లులు పడే కాలం

ఓటు బ్రహ్మాస్త్రం సంధించేవాడు 
లోక కళ్యాణం కోరాలి
పయోముఖ విష కుంభాల ముందు
అర్జునుడి కన్నా ఒక ఆకు ఎక్కువ చదువుకుని విజృంభించాలి
చివరికి ప్రజలు గెలవాలి
ప్రగతి పతాక ఎగరాలి
ప్రజాస్వామ్యం మురవాలి

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం