వృత్తిరీత్యా న్యాయవాది గులాబీల మల్లారెడ్డి. కరీంనగర్లో ప్రజా న్యాయవాదిగా ప్రసిద్దులయిన మల్లారెడ్డి ప్రజలతో, ప్రజా ఉద్యమాలతో, ఉద్యమాలలో పనిచేసే వారితో సన్నిహిత సంబంధం వున్నవారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. వారు ఇప్పటివరకు పది పుస్తకాలు వెలువరించారు. అందులో కవిత్వం, కథలు, నవలలు ఉన్నాయి. ఈమధ్యన వారు రచించిన ఒక కథల పుస్తకం - ఐదు తరాలు, ఒక నవల - క్యాంపస్లో సరిగమలు అచ్చయినాయి.
కథల పుస్తకం ఆవిష్కరణ సభ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో ఈ నెల 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. ఈ సభకు కె. ఆనందాచారి అధ్యక్షత వహిస్తారు. ఏనుగు నరసింహారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. విశిష్ట అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి, ఆత్మీయ అతిథులుగా అరసం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్, బొజ్జా భిక్షమయ్య, ప్రమోద్ ఆవంచ, వేముల ప్రబాకర్ హాజరవుతారు.
గులాబీల మల్లారెడ్డి రచించిన నవల - క్యాంపస్లో సరిగమలు ఆవిష్కరణ సభ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నాం 1.30 గంటలకు జరుగుతుంది. ఈ సభకు ప్రముఖ రచయిత సి.ఎస్. రాంబాబు అధ్యక్షత వహిస్తారు. పుస్తకాన్ని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరిస్తారు. విశిష్ట అతిథిగా మంత్రి శ్రీదేవి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయితలు చెన్నయ్య దోరవేటి, ప్రమోద్ ఆవంచ, వేముల ప్రభాకర్ హాజరవుతారు.