ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం

By telugu teamFirst Published Jul 21, 2021, 2:38 PM IST
Highlights

ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎల్లూరి శివారెడ్డిని దాశరథి కృష్ణమాచార్య పురస్కారం వరించింది. తెలంగాణ ప్రభుత్వం యేటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారం- 2021 కి ప్రముఖ సాహితీవేత్త, పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డిని ఎంపిక చేసింది.

ఈ పురస్కారాన్ని గురుావరం రవీంద్రభారతిలో జరిగే మహాకవి దాశరథి జయంతి ఉత్సవాలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం కింద రూ 1,01,116/- నగదుతోపాటు, మెమెంటోను కూడా బహుకరించి, శాలువాతో సత్కరిస్తారు.

ఏల్లూరి శివారెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గా పనిచేశారు. అంతకు ముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ సారస్వత పరిషత్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలం కల్లూరులో ఆయన జన్మించారు. ఆయన రాసిన సురవరం ప్రతాపరెడ్డి జీవితం - సాహిత్యం అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఆంధ్ర మహాభారతంలో రసపోషణ అనే అంశంపై ఆయన పరిశోధన చేసి పిచ్ డీ పట్టా పొందారు.

click me!