ఈ. వెంకటేష్ కవిత : మనిషి కథ

By SumaBala BukkaFirst Published Dec 13, 2023, 2:48 PM IST
Highlights

ఆధునిక సాంకేతిక మాయాజాలంలో మనిషి తప్పిపోయాడు అంటూ ఈ. వెంకటేష్ రాసిన కవిత ' మనిషి కథ ' ఇక్కడ చదవండి :

అనగనగా
ఒక మనిషి...
మానవత్వం ధరించి
విలువలను అలంకారాలుగా
ఆవాహన చేసుకుని
సాటి మనిషి పట్ల
దయాసముద్రుడై
తొలి పొద్దు సూర్యునిలా
కరుణోదయ కటాక్షాలను
విరివిగా వెదజల్లే వాడు

అప్పటి మనీషి
స్వార్థ రహితుడై
బాటసారులకు తియ్యటి తేనెను
ఉచితంగా పంచేవాడు

క్రమేపి కాలం మారింది
కాలసర్పంలా  మనిషిని కాటేసింది
స్వార్థం ఒళ్లంతా పాకి
డబ్బు పిచ్చి వైరస్ లా వ్యాపించి 
మనుషులను వెన్నెముక లేని
తల నిటారుగా నిలుపలేని
జంతువులా మార్చింది

ఆధునిక సాంకేతిక మాయాజాలంలో
మనిషి తప్పిపోయాడు
తన చిరునామాను మరిచిపోయాడు
మూలాలను మూలకు నెట్టి
స్మార్ట్ ఫోన్లలో
తన ముఖాన్ని సిగ్గుతో దాచుకుంటున్నాడు
సాటి మనిషితో మాట్లాడడం
కడుపారా కరచాలనం చేయడం
గత కాలపు పురాతన వైభవ చిహ్నం

అభివృద్ధి అంటే మనిషితనాన్ని తాకట్టు పెట్టి 
అధోగతికి దిగజారడం అనుకుంటున్నాడు
ఈ విశ్వమంతా
కాసిన్ని విశ్వాస మానవత్వపు
విత్తనాలు చల్లడం అని తెలుసుకోలేకున్నాడు.

కవులు, రచయితలకు ఏసియా నెట్ సాహితీ వేదిక స్వాగతం

click me!