టీఆర్‌ఎస్ పతనానికి ఆర్టీసి సమ్మెతో నాంది: సిపిఎం

By Arun Kumar PFirst Published Oct 9, 2019, 4:23 PM IST
Highlights

ఆర్టిసి ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఇవాళ కరీంనగర్ జిల్లా సిపిఎం శాఖ ఆద్వర్యంలో ధర్నా చేపట్టడమే కాకుండా ర్యాలీ నిర్వహించారు.  

కరీంనగర్:  తెలంగాణ ఆర్టీసి కార్మికుల సమ్మెతోనే టీఆర్ఎస్ పతనం మొదలయ్యిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి తెలిపారు. ఆర్టిసి కార్మికులకు మద్దతుగా సిపిఎం  కరీంనగర్ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో డిపో-1వద్ద ధర్నా చేపట్టారు. అక్కడి నుండి ర్యాలీగా ఆర్టీసి జేఏసి నడుస్తున్న సభ వద్దకు ర్యాలీగా వెళ్ళారు. 

ఈ సమావేశం అనంతరం  గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసి కార్మికులూమైనా సీఎం ఫామ్ హౌసులో పనిచేసే పనివాళ్ళేమీ కాదు తన ఇష్టం వచ్చినట్లు తీసివేయడానికి అని ప్రశ్నించారు. ఉద్యోగులను తొలగిస్తామని అనటం అప్రజాస్వామికమని అన్నారు. ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనదని అన్నారు. 

లేబర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి సమ్మె నోటీస్ 35 రోజుల ముందే ఇచ్చారని అన్నారు.   సమ్మె  కార్మికుల జన్మ హక్కు అని,పుట్టిన బిడ్డ పాల కోసం ఏడ్చే ఏడుపును చట్టం చేసి అపగలమా అని ప్రశ్నించారు. ఆర్టీసికి ప్రభుత్వం ఇవ్వవలసిన  రాయితీల డబ్బులు 2500కోట్లు చెల్లించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని అన్నారు. 

ఆర్టీసి వినియోగిస్తున్న డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం రోజుకు కోటి రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రోజుకు కోటీ పది లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయని అన్నారు. కార్మికులు సెప్టెంబర్ నెల పనిచేసిని జీతం కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఇది కక్షపురితం తప్పమరొకటి కాదని అన్నారు. 

 కార్మికుల సమ్మెలో ప్రజలు, కార్మికులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని  సమ్మె మరింత ఉదృతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారి శేఖర్, మిల్కురి వాసుదేవరెడ్డి, గుడికందుల సత్యం,క్యాడర్ ఎడ్ల రమేష్, రాయికంటి శ్రీనువాష్, అజయ్, మల్లారెడ్డి, లింగారెడ్డి, జగదీష్, చంద్రమౌళి, స్వామి, మల్లయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

click me!