కార్మికులు నీ ఫామ్ హౌసులో పనిచేసే పనివాళ్లా: సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి

By Siva KodatiFirst Published Oct 9, 2019, 9:06 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు సీఎం ఫామ్ హౌసులో పనిచేసే పనివాళ్ళా..  తన ఇష్టం వచ్చినట్లు తీసివేయడానికి అని ప్రశ్నించారు. ఉద్యోగులను తొలగిస్తామని అనటం అప్రజాస్వామికమని.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనదని ముకుందరెడ్డి పేర్కొన్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో టీఆర్ఎస్ పతనం తప్పదన్నారు కరీంనగర్ జిల్లా సీపీఎం కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం కరీంనగర్ జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో డిపో-1వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.

అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా ఆర్టీసీ జేఏసీ సభ వద్దకు వెళ్లారు. అనంతరం ముకుందరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సీఎం ఫామ్ హౌసులో పనిచేసే పనివాళ్ళా..  తన ఇష్టం వచ్చినట్లు తీసివేయడానికి అని ప్రశ్నించారు.

ఉద్యోగులను తొలగిస్తామని అనటం అప్రజాస్వామికమని.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనదని ముకుందరెడ్డి పేర్కొన్నారు. లేబర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి సమ్మె నోటీస్ 35 రోజుల ముందే ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

సమ్మె  కార్మికుల జన్మ హక్కు అని,పుట్టిన బిడ్డ పాల కోసం ఏడ్చే ఏడుపును చట్టం చేసి అపగలమా అని ముకుందరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వవలసిన  రాయితీల డబ్బులు 2500 కోట్లు చెల్లించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు.

డీజల్ పై రాష్ట్ర ప్రభుత్వం రోజుకు కోటి రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రోజుకు కోటీ పది లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయని ముకుందరెడ్డి గుర్తు చేశారు. కార్మికుల సమ్మెలో ప్రజలు, కార్మికులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని  సమ్మె మరింత ఉదృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 

Last Updated Oct 9, 2019, 9:07 PM IST