యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ రెస్టారెంట్..

By AN TeluguFirst Published Jan 15, 2021, 1:04 PM IST
Highlights

ముందూ, వెనకా తెలుసుకోకుండా ఓ ట్యూబర్ చేసిన తప్పుడు వీడియో వల్ల ఏకంగా ఓ రెస్టారెంట్ మూతపడింది. చేతిలో కెమెరా ఉంది కదా అని ఏది పడితే అది షూట్ చేసి వీడియో పెట్టి వ్యూస్ సాధించాలనుకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణ ఈ సంఘటన. 

ముందూ, వెనకా తెలుసుకోకుండా ఓ ట్యూబర్ చేసిన తప్పుడు వీడియో వల్ల ఏకంగా ఓ రెస్టారెంట్ మూతపడింది. చేతిలో కెమెరా ఉంది కదా అని ఏది పడితే అది షూట్ చేసి వీడియో పెట్టి వ్యూస్ సాధించాలనుకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణ ఈ సంఘటన. 

దక్షిణ కొరియాలో తాజాగా ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియో ఓ రెస్టారెంట్ మూతపడడానికి కారణమైంది. ఆలస్యంగా నిజం తెలుసుకున్న యూట్యూబర్ తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

దక్షిణ కొరియాకు చెందిన హయాన్ ట్రీ అనే ఓ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్కడి డేగు అనే ప్రాంతం లోని ఆల్-యు-కెన్-సోయా సాస్-మెరినేటెడ్ అనే రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియోను అప్‌లోడ్ చేసాడు. 

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. తాను రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు పాచి పదార్థాలను సర్వ్ చేశారని చెబుతూ వీడియో చేసి పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియో పోస్ట్ చేసేనాటికి హయాన్ ట్రీ ఛానెల్‌కు 7లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 

దీనిమీద అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఛానెల్ సబ్ స్క్రైబర్స్ చాలామంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ రెస్టారెంట్ సిసి కెమెరా ఫుటేజీని మరొకసారి పరిశీలించారు. అయితే అతనికి సర్వ చేసింది పాడైన ఆహారం కాదని, ఆయన ఆర్డర్ లో కనిపించిన అన్నం మెతుకులు హయాన్ట్రీ కంటే ముందు ఆర్డర్ ఇచ్చిన వారు తినేప్పుడు పడ్డవని తెలిపారు.

దీంతో ఈ విషయంలో తప్పు జరిగిపోయిందని తెలుసుకున్న యూ ట్యూబర్ ‘ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండా వీడియోను అప్‌లోడ్ చేసాను. అందుకు రెస్టారెంట్ యజమానికి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను, తప్పు జరిగిందని దాన్ని సరిదిద్దేలా మరో వీడియో చిత్రీకరిస్తానని చెప్పినా దాని యజమాని ఒప్పుకోలేదు" అని హయాన్ ట్రీ చెప్పారు. అంతేకాదు ఖచ్చితమైన వాస్తవాలతో వీడియోను రూపొందించడం చాలా అవసరం అని వాపోయాడు.

మూతపడిన రెస్టారెంట్ యజమాని చెయోంగ్ వా డే వెబ్‌సైట్‌లో ఇలా రాసుకొచ్చారు. "యూట్యూబర్ వీడియోను పోస్ట్ చేసిన రెండు, మూడు గంటలలోపు సీసీ కెమెరాలోని మొత్తం ఫుటేజీని పరిశీలించాము. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. మా వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోలేదు. తప్పుడు సమీక్ష వీడియో 1 మిలియన్ వీక్షణలకు చేరుకుంది. ఈ వీడియో ఎందుకు వైరల్ అయ్యిందో తనకు అర్థం కాలేద’’ని ఆయన అన్నారు.

సోయా సాస్-మెరినేటెడ్ పీత రెస్టారెంట్ వివాదాస్పద వీడియో తప్ప హయాన్ ట్రీ చేసిన అన్ని వీడియోలు ఇప్పటికీ అతని యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి, అయితే వాటన్నింటికీ కామెంట్ సెక్షన్ బ్లాక్ చేయబడింది. ఈ దెబ్బతో అతడి సబ్ స్క్రైబర్‌ల సంఖ్య 6,70,000 లకు పడిపోయింది.

ఈ ఘటనపై రెస్టారెంట్ యజమానికి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి యూట్యూబర్లను నియంత్రించేలా చట్టాలు తీసుకురావాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు.
 

click me!