కిడ్నీలో రాళ్లేమోనని బాత్రూమ్‌లోకి పరుగులు... పండంటి బిడ్డకు జన్మ, షాకైన మహిళ

By Siva KodatiFirst Published Apr 7, 2021, 9:32 PM IST
Highlights

గర్భం దాల్చిన విషయం కూడా తెలియకుండానే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

గర్భం దాల్చిన విషయం కూడా తెలియకుండానే ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బోస్టన్ నగరానికి చెందిన 38 ఏళ్ల మెలిస్సా సర్జ్‌కాఫ్‌కు గతనెల 8న తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.

అయితే కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పిగా సర్జ్‌కాఫ్ భావించి వెంటనే బాత్రూంలోకి పరుగులు తీసింది. అనంతరం బాత్రూంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. షాక్‌కు గురైంది. 

తాను గర్భందాల్చిన విషయం కూడా తనకు తెలియదని ఆమె చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఖంగుతున్నారు. కొన్ని నెలలుగా రుతుస్రావం కాకపోయినప్పటికీ.. పొట్ట పరిమాణం మాత్రం సాధారణంగానే ఉండటంతో తాను ప్రెగ్నెంట్ అయినట్లే లేదని మెలిస్సా చెప్పారు.

ఇదే సమయంలో గత నెల 8న అకస్మాత్తుగా వచ్చిన నొప్పులను పురుటి నొప్పులుగా గ్రహించలేకపోయానని ఆమె తెలిపారు. కిడ్నీలోంచి రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పులుగా భావించానని.. అయితే జననాంగాల నుంచి రక్తం రావడాన్ని చూసి.. పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పులుగా అంచనా వేసినట్టు సర్జ్‌కాఫ్ పేర్కొన్నారు.

బాత్‌రూంలోకి పరిగెత్తగా.. జననాంగాల నుంచి రక్తంతోపాటు మాంసం ముద్ద కూడా రావడాన్ని చూసి.. ఏదో అవయం తన శరీరం నుంచి బయటికి వస్తోందని భ్రమపడ్డానని చెప్పారు.

చివరికి తన భర్త డొనాల్డ్ క్యాంప్‌బెలే.. అసలు విషయం చెప్పాడని మెలిస్సా వెల్లడించారు. గట్టిగా అరవడంతో బాత్రూంలోకి వచ్చిన డొనాల్డ్ క్యాంప్.. తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్టు చెప్పాడంతో తాను షాక్‌కు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.

డాక్టర్లు సైతం ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. కాగా, బ్రెజిల్‌కు చెందిన 20 ఏళ్ల మహిళ, బ్రిటన్‌కు చెందిన 32 ఏళ్ల మరో మహిళ కూడా ఇదే విధంగా ప్రసవించారంటూ ఇటీవల కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
 

click me!