కరోనా వ్యాక్సినేషన్: 46 దేశాల్లో ప్రారంభమైన పంపిణీ, అమెరికానే టాప్

By Siva KodatiFirst Published Jan 14, 2021, 3:18 PM IST
Highlights

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పలు దేశాలు అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేశాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పలు దేశాలు అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేశాయి.

కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల మంది టీకాలు తీసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే, టీకాల పంపిణీలో ఎక్కువగా ధనిక దేశాలే ముందున్నాయని పేర్కొంది.   

ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైందని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగం డైరెక్టర్‌ మైక్‌ రేయాన్‌ వెల్లడించారు. వీటిలో అధిక ఆదాయ దేశాలే 38 ఉన్నట్లు తెలిపారు.

వ్యాక్సినేషన్‌‌ ప్రారంభమైన దేశాల్లో దాదాపు ఐదు రకాల టీకాలకు చెందిన 2 కోట్ల 80 లక్షల డోసులు పంపిణీ అయ్యాయని చెప్పారు.  కోవిడ్ వెలుగులోకి వచ్చి ప్రస్తుతం రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్న రేయాన్.. వైరస్‌ వ్యాప్తి గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది పరిస్థితి దారుణంగానే వుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

తీవ్ర వ్యాప్తి కలిగిన కరోనా స్ట్రెయిన్‌లు బయటపడుతోన్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరని మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. మరికొన్ని దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు.  

కాగా, ఓ అనధికార నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 24 లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా అమెరికాలో కోటి 8 లక్షల మందికి డోసులు ఇచ్చినట్లు సీడీసీ వెల్లడించింది.

వీరిలో దాదాపు ఏడున్నర లక్షల మంది రెండో డోసు కూడా తీసుకున్నట్లు పేర్కొంది. ఇక కోవిడ్ పుట్టిల్లైన చైనాలోనూ వ్యాక్సిన్‌ పంపిణీ భారీస్థాయిలోనే జరుగుతోందట. గడిచిన వారం అక్కడ 90 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు చైనా మీడియా వెల్లడించింది.

వీటితో పాటు ఐరోపా దేశాల్లోనూ టీకా పంపిణీ వేగవంతమైంది. మరోవైపు భారత్‌లో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి, వృద్ధులకి టీకా వేయనున్నారు. 

click me!