మేం చాలా అదృష్టవంతులం.. భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం - బంగ్లాదేశ్ ప్రధాని హసీనా

By Sairam IndurFirst Published Jan 7, 2024, 2:14 PM IST
Highlights

Bangladesh PM Sheikh Hasina : తాము చాలా అదృష్టవంతులమని, భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విమోచనోద్యమ సమయంలో వారు తమకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.

Sheikh Hasina : బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా భారత్ ను కొనియాడారు. 1971లో జరిగిన విమోచన యుద్ధంలో ఆ దేశ వాసులకు భారత్ అందించిన సహాయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. భారత్ అందించిన మద్దతును ఆమె ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సందేశాన్ని పంపారు. ఓటును ఉపయోగించుకున్న అనంతరం భారత్ కు పంపిన సందేశం గురించి షేక్ హసీనా గురించి ప్రశ్నించగా ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చిందని ‘ఇండియా టీవీ’ నివేదించింది.

‘‘మేం చాలా అదృష్టవంతులం. భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం. మా విమోచనోద్యమ సమయంలో వారు మాకు మద్దతు ఇచ్చారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు వారు మాకు ఆశ్రయం కల్పించారు. భారత ప్రజలకు మా శుభాకాంక్షలు’’ అని ఆమె పేర్కొన్నారు.

1975లో  ఆమె కుటుంబం మొత్తం హత్యకు గురై, ఏళ్ల తరబడి భారత్ లో ప్రవాస జీవితం గడిపిన భయానక పరిస్థితులను ప్రధాని హసీనా ఈ సందర్భంగా వివరించారు. తరువాత ఆమె ఢాకాకు తిరిగి వచ్చి బంగ్లాదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన అవామీ లీగ్ ను స్థాపించారు.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం హసీనా మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం ఎంతో అవసరమని, తమ ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక హక్కులను నెలకొల్పిందన్నారు. ‘‘మనది సార్వభౌమాధికారం, స్వతంత్ర దేశం. పెద్ద జనాభా ఉన్న దేశం. ప్రజల ప్రజాస్వామిక హక్కులను నెలకొల్పాం... ఈ దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగాలి. ప్రజాస్వామ్యం లేకుండా మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేరని నేను కోరుకుంటున్నాను. మనది 2009 నుంచి 2023 వరకు దీర్ఘకాలిక ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టి, అందుకే బంగ్లాదేశ్ ఈ ఘనత సాధించింది’’ అని అన్నారు. 

| Dhaka: In her message to India, Bangladesh Prime Minister Sheikh Hasina says, ''You are most welcome. We are very lucky...India is our trusted friend. During our liberation war, they supported us...After 1975, when we lost our whole family...they gave us shelter. So our… pic.twitter.com/3Z0NC5BVeD

— ANI (@ANI)

ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసే వాతావరణాన్ని తమ ప్రభుత్వం సృష్టించిందని ప్రధాని హసీనా నొక్కి చెప్పారు. ‘‘బంగ్లాదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా మన దేశ ప్రజలకు తమ ఓటు హక్కు, ఎన్నికల ఆవశ్యకత గురించి బాగా తెలుసు... ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసే వాతావరణాన్ని కల్పించగలిగాం.’’ అని తెలిపారు.

‘‘రైలును తగలబెట్టడం, వాహనాలను తగలబెట్టడం, ప్రజల కదలికలను నిలిపివేయడం వంటి అనేక హింసాత్మక కార్యకలాపాలను బీఎన్పీ, జమాత్ చేశాయి. వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. వారు దేశభక్తులు కాదు. ప్రజల అభివృద్ధికి వారు వ్యతిరేకం. పైగా ప్రజాస్వామ్యం కొనసాగాలని వారు కోరుకోవడం లేదు’’ 

ఇదిలా ఉండగా.. 299 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి బంగ్లాదేశ్ లో 12వ జాతీయ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు ఓటు వేయనున్నారు. నేడు కొనసాగుతున్న ఎన్నికల కోసం 42,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 119.6 మిలియన్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆ దేశ ఎన్నికల సంఘం నివేదించింది. కాగా.. ప్రధాని షేక్ హసీనా వరుసగా నాలుగోసారి విజయం సాధిస్తారని పలు స్థానిక, అంతర్జాతీయా మీడియాలో అంఛనా వేశాయి.

click me!