Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను యుద్ధ నేరస్థుడు అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దాష్టీకం వల్ల వేలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ప్రజలు దేశ విడిచి పారిపోయారని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల వల్ల ప్రపంచ శాంతికి ప్రమాదం వాటిల్లుతోందని జో బిడెన్ తీవ్రంగా ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన.. క్రెమ్లిన్( రష్యా అధ్యక్ష భవనం) అమెరికాకు రష్యాపై విమర్శలు చేసే అధికారం లేదనీ, యుద్ధ నేరాలపై లెక్చర్లు ఇచ్చే హక్కు అమెరికాకు లేదని జో బిడెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని క్రెమ్లిన్ పేర్కొంది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. బుధవారం నాడు జో బిడెన్ మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ను యుద్ధ నేరస్థుడని పిలవడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్నించగా.. తొలుత "లేదు" అని ప్రతిస్పందించిన తర్వాత, "ఓహ్, అతను యుద్ధ నేరస్థుడని..నేను భావిస్తున్నా " అని చెప్పాడు.
బిడెన్ వ్యాఖ్య గురించి అడిగినప్పుడు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. "మా అధ్యక్షుడు చాలా తెలివైన, సంస్కారవంతమైన వ్యక్తి అని, రష్యన్ ఫెడరేషన్ అధిపతి, మా దేశాధినేత. బిడెన్ చేసిన ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవు, ఆమోదయోగ్యం కావు, క్షమించరానివి" అని పెస్కోవ్ అన్నారు.
ప్రధాన విషయం ఏమిటంటే.. చాలా సంవత్సరాలుగా ప్రపంచదేశాలపై బాంబులు వేసిన చరిత్ర అమెరికా కు ఉందనీ, అలాంటి దేశ అధ్యక్షుడి ఇలాంటి ప్రకటనలు చేసే హక్కు లేదని పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్దం 1945లో అమెరికా ఓడిపోయిన జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై బాంబుతో దాడి చేసి ఆ నగరాలను ధ్వంసం చేసిందని పెస్కోవ్ చెప్పారు. అమెరికా బాంబుల దాడిలో దాదాపు 200,000 మంది మరణించారనీ, చాలా మంది రేడియేషన్ అనారోగ్యంతో మరణించారని తెలిపారు.
రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన సూపర్ పవర్ను ఉందని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. రష్యాను ముక్కలు చేయడానికి పశ్చిమ దేశాలు క్రూరమైన రస్సోఫోబిక్ కుట్రను పన్నుతున్నాయని ఆరోపించింది. రష్యా ఇతర దేశాల బెదురింపులకు బయపడదనీ, రష్యా తన శత్రు సేనను ఎక్కడ ఉంచాలో తెలుసునని రష్యా భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీగా ఉన్న మెద్వెదేవ్ అన్నారు.
గత 22 రోజులుగా.. ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తోంది. ఈ దాడిని వ్యతిరేకిస్తూ.. యునైటెడ్ స్టేట్స్, మరియు దాని ఐరోపా మరియు ఆసియా మిత్రదేశాలు రష్యా నాయకులు, కంపెనీలు మరియు వ్యాపారవేత్తలపై ఆంక్షలు విధించాయి, రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా భాగం నుండి తొలగించాయి.
ఉక్రెయిన్ అస్తిత్వం కోసం పోరాడుతోందని, మారణహోమానికి సంబంధించిన పుతిన్ వాదనలు అర్ధంలేనివని పేర్కొంది. రష్యాను చీల్చాలనుకుంటున్నట్లు పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..పుతిన్ను యుద్ధ నేరస్థుడిగా గుర్తించాలని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ బుధవారం యూరోపియన్ యూనియన్ పేర్కొన్నాడు.