అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. ఈ చర్యతో ట్విటర్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్పై నిషేధంతో సోమవారం ట్విటర్ షేర్ 12 శాతం కుప్పకూలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 బిలియన్ డాలర్లు ఆవిరై పోయింది.
మరోవైపు ఇప్పటికే ట్రంప్ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసిన సంస్థ తాజాగా మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. ట్రంప్ మద్దతుదారులకు చెందిన సుమారు 70వేల అకౌంట్లను నిలిపి వేసింది. ట్రంప్ కు ట్విటర్లో సుమారు 88 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
వాషింగ్టన్, డీసీలో హింసాత్మక సంఘటనలు కొనసాగే ప్రమాదం ఉన్నందున క్యాపిటల్ ఘటనకు సంబంధించిన కంటెంట్ను షేర్ చేస్తున్న వేలాది ఖాతాలను శుక్రవారం నుంచి శాశ్వతంగా నిలివేస్తున్నట్లు ట్విటర్ సోమవారం ఆలస్యంగా తన బ్లాగ్లో వెల్లడించింది. కీన్ అబ్జర్వేషన్ తరువాత 70వేల ఖాతాలను ఆపివేసినట్టు చెప్పింది.
గతవారం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ క్యాపిటల్లో అమెరికా కాంగ్రెస్ సమావేశమైన సమయంలో ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఏకంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకువచ్చి వీరంగం వేసిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశానికి ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి వరుస ట్వీట్లు చేశారు. దీంతో ట్రంప్ అధికారిక ఖాతాను ట్విటర్ శాశ్వతంగా నిషేధించింది. ట్రంప్ ట్వీట్లు హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉందని భావించిన ట్విటర్ ఈ నిర్ణయం తీసుకుంది.
మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా ట్రంప్ అనుకూల పోస్టులపై చర్యలు చేపట్టింది. తమ నిబంధనలు ఉల్లంఘించే ఎలాంటి పోస్టులనైనా తొలగిస్తామని, హింసను ప్రేరేపించే తప్పుడు సమాచార వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.