Iran Blasts : ఇరాన్ లో భారీ పేలుళ్ల జరిగాయి. ఈ ఘటనలో 103 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఆ దేశ జనరల్ ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమం బుధవారం జరుగుతున్న సమయంలో వరుసగా రెండు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనను ఉగ్రవాద దాడి అని కెర్మన్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. ఈ పేలుళ్లలో కనీసం 170 మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా పేర్కొంది.
బాంబులతో వెళ్తున్న రెండు బ్యాగులను రిమోటో ద్వారా పేల్చినట్టు ఇరాన్ కు చెందిన వార్తా సంస్థ ‘తస్నీమ్’ తెలిపింది. 10 నిమిషాల వ్యవధిలో బాంబులు పేలాయని కెర్మన్ మేయర్ సయీద్ పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. భయభ్రాంతులకు గురైన జనం అక్కడి నుంచి పారిపోయేందుకు ఎగబడుతున్న దృశ్యాలు, పలు అంబులెన్సులు, రెస్క్యూ సిబ్బంది అక్కడి నుంచి బయటకు వచ్చిన వీడియోల్లో కనిపిస్తున్నాయి.
2020 జనవరి 3వ తేదీన ఇరాన్ లోని బాగ్దాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఆ దేశ దివంగత జనరల్ ఖాసీం సులేమానీ అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. ఈ హత్యకు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు. అయితే సులేమానీ మరణించిన నాలుగో వర్థంతిని నేపథ్యంలో ఆయన సమాధి అయిన కెర్మాన్ లోని సాహెబ్ అల్-జమాన్ మసీదు సమీపంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ విదేశీ ఆపరేషన్స్ విభాగమైన ఖుద్స్ ఫోర్స్ కు సులేమానీ నేతృత్వం వహించారు. మధ్యప్రాచ్యం అంతటా సైనిక చర్యలను పర్యవేక్షించేవారు. ఇరాన్ అత్యున్నత నాయకుడైన అయతుల్లా అలీ ఖమేనీ.. సులేమానీ జీవించిన ఉన్న సమయంలోనే 'సజీవ అమరవీరుడు'గా ప్రకటించారు. ఆయన ఇరాక్, సిరియా రెండింటిలోనూ ఇస్లామిక్ స్టేట్ జిహాదీ గ్రూపును ఓడించడంలో కీలక పాత్ర పోషించినందుకు హీరోలా కొలిచారు.
అయితే అమెరికా, దాని మిత్రదేశాలు చాలాకాలంగా సులేమానీని ప్రాణాంతక శత్రువుగా భావించాయి. ఆయన సిరియా, ఇరాక్, యెమెన్ లలో ఇరాన్ రాజకీయ, సైనిక ఎజెండాను నిర్దేశించి ఈ ప్రాంతంలోని అతి ముఖ్యమైన పవర్ బ్రోకర్లలో ఒకరుగా నిలచారు. కాగా.. 2020లో సులేమానీ హత్యకు గురైన కెర్మన్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో లక్షలాది మంది జాతీయ ఐక్యతను ప్రదర్శించడానికి సంతాపం ప్రకటించారు. అయితే ఈ సమయంలో కూడా తొక్కిసలాటో చోటు చేసుకుంది. ఆ ఘటనలో 56 మంది చనిపోయారు.