
న్యూఢిల్లీ: దక్షిణాసియాలో భారత్ కీలకమైన దేశమని, ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో ఆ దేశానికి ఎలాంటి ముప్పూ ఉండబోదని తాలిబాన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు దశాబ్దాలుగా మంచి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ఏర్పడే కొత్త ప్రభుత్వమూ(తాలిబాన్ ప్రభుత్వమూ) భారత్తో సత్సంబంధాలు ఆశిస్తున్నదని స్పష్టం చేశారు.
తాలిబాన్లు పాకిస్తాన్ వైపు పక్షపాతం వహిస్తారని, ఇతర దేశా ల కంటే పాక్కే అధిక ప్రాధాన్యతనిస్తారన్న వార్తలు వచ్చాయని, భారత్ను కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ చేతిలో ఆయుధంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందన్న కథనాలను జబీబుల్లా ముజాహిద్ ముందు ప్రస్తావించగా వాటిని కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని అన్నారు. ఒక దేశానికి వ్యతిరేకంగా ఇంకో దేశం తమను వాడుకోవడాన్ని తాలిబాన్లు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోరని స్పష్టం చేశారు. భారత్కు తమ నుంచి ఎలాంటి హానీ ఉండబోదని స్పష్టంగా చెప్పాలని భావిస్తున్నామి హామీనిచ్చారు.
ఆగస్టు 26న ఓ ప్రకటనలో జబీబుల్లా ముజాహిద్ పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు వంటిదని కితాబిచ్చారు. సరిహద్దులు కలిసి ఉండటం సంప్రదాయం, మతాల కలయికతో ఉభయ దేశాల ప్రజలు సులభంగా కలిసిపోతారని అన్నారు. అందుకే పాకిస్తాన్తో మరింత లోతైన సంబంధాలను తాము కోరుకుంటున్నామని వివరించారు.
కాగా మరో తాలిబాన్ నేత షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్తానిక్జై పాకిస్తాన్, భారత్ సంబంధాలపై స్పందించారు. పాకిస్తాన్, భారత్కు మధ్య ఘర్షణలున్న మాట వాస్తవమేనని అన్నారు. అవి రెండు వాటిమధ్య ఉన్న సరిహద్దు గుండా పొట్లాడుకోవచ్చునని, కానీ, ఆ రెండు దేశాల మధ్య గొడవల్లోకి తమను లాగవద్దని తెలిపారు.
ఇదిలా ఉండగా జమ్ము కశ్మీర్లో జైషే మొహమ్మద్ తీవ్రవాదుల ముప్పు ఎక్కువ ఉన్నది. ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఇటీవలే కాందహార్ చేరుకుని తాలిబాన్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. 1999లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి లక్నోకు రావాల్సిన విమానాన్ని నేరుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి తాలిబాన్ ప్రభుత్వం వారికి దన్నుగా నిలిచింది. భారత్ నుంచి మసూద్ అజర్ను విడిపించుకోవడంలో ఉగ్రవాదులకు తోడ్పడింది. ఈ తరుణంలో మసూద్ అజర్ మళ్లీ తాలిబాన్ల కలవడం కలకలం రేపింది.