
రష్యా సేనలు ఉక్రెయిన్ను మూడు వైపులా చుట్టుముట్టాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో ఉక్రెయిన్ సర్కార్ ఎమర్జెన్సీ విధించింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. యుద్ధం వస్తే ప్రజలంతా సిద్ధంగా వుండాలని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జిలెన్స్కీ పిలుపునిచ్చారు. రష్యా సేనలు దాడి చేసినా భయపడేది లేదని.. ప్రతిదాడి చేస్తామని ఉక్రెయిన్ హెచ్చరికలు చేసింది.
జర్మనీ, బ్రిటన్, అమెరికా, ఆంక్షలు విధించినా రష్యా మాత్రం వెనుకంజ వేయడం లేదు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డోనిస్క్, లుహాస్లను పూర్తి స్థాయి దేశాలుగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రత్యేక బలగాలను పంపారు. పుతిన్ నిర్ణయాన్ని యూరప్ దేశాలతో పాటు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రష్యా నుంచి వచ్చే గ్యాస్ పైప్లైన్ పూర్తిస్థాయిలో నిలిపివేసింది జర్మనీ. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా దేశాలు బ్యాంకులపై ఆంక్షలు విధించాయి. ఎమర్జెన్సీ విధించిన ఉక్రెయిన్ సర్కార్.. అవసరమైతే మార్షల్ చట్టాన్ని ప్రయోగిస్తామని పేర్కొంది.
మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ సరిహద్దు నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా (air india) మంగళవారం బోయింగ్ (boeing)-787 విమానాన్ని నడిపింది. ఈ విమానంలో 250 మందికి పైగా ప్రయాణీకుల సిట్టింగ్ కెపాసిటీ ఉంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ (flight tracking website) ప్రకారం.. AI-1947 IST ఉదయం 7.30 గంటలకు న్యూఢిల్లీ (new delhi) నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఉక్రెయిన్లోని కైవ్ (Kyiv)లోని విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం ఇక్కడికి వచ్చింది. కైవ్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం మరోసారి భారతీయ విద్యార్థులను తాత్కాలికంగా భారతదేశానికి తిరిగి రావాలని సూచించింది.
ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఇండియా నుంచి ఉక్రెయిన్ మధ్య మూడు విమానాలు నడపనున్నట్లు ఎయిరిండియా ఫిబ్రవరి 19వ తేదీన ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విమానయాన సంస్థ విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వినోద్ కణ్ణన్ (vinod kannan)_మాట్లాడుతూ.. తమ విమనాలను ఉక్రెయిన్ కు పంపించే ప్రణాళిక ఏమీ లేదని తెలిపారు. ‘‘ విమాన పరిమితులు, ఇతర కారణాల వల్ల మేము ఉక్రెయిన్కు ప్రస్తుతం విమానాలను ప్లాన్ చేయడం లేదు ’’ అని ఆయన ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా తెలిపారు.
సోమవారం రాత్రి రష్యా (russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద నియంత్రణ ప్రాంతాలను గుర్తించారు. అప్పటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీంతో పాటు రష్యా అధ్యక్షుడు ఆదేశాలతో ఆ దేశానికి చెందిన మిలటరీ ఉక్రెయిన్ లోపలకు చొచ్చుకెళ్తున్నాయి. దీంతో ఉక్రెయిన్, నాటో (NATO) దేశాలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (Jeo biden) ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు రక్షణ ఆయుధాలను అమెరికా సమకూరస్తుందని చెప్పారు. తమకు రష్యాతో గొడవ పడే ఉద్దేశం లేదని అయితే అదే సమయంలో నాటో భూభాగంలోని ఒక్క అంగులం కూడా కోల్పొకుండా చూసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో రష్యాపై తీవ్రంగా విరుచుపడ్డారు. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను ప్రకటిస్తున్నట్టు చెప్పారు.