
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు వెనుకబాటు తదితర అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ .. మరోసారి అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ లేవనెత్తారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో మాట్లాడిన ఆయన.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి పలు ప్రతిపాదనలు చేశారు. తాము భారత్ సహా తమ పొరుగు దేశాలన్నింటితో శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. రెండు దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయన్న సందేశాన్ని భారత్ అర్థం చేసుకునే సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నాను అని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
యుద్ధం ఒక ఆప్షన్ కాదని, శాంతియుత చర్చలే సమస్యలను పరిష్కరించగలవని, తద్వారా రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యకు న్యాయమైన, శాశ్వత పరిష్కారం అవసరమని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయం పూర్తిగా భారత్ అంతర్భాగ విషయం.
మనం శాంతిగా ఉంటామా లేక ఒకరితో ఒకరు పోట్లాడుకుందామా తేల్చుకోవాలని, నిర్మాణాత్మక నిశ్చితార్థానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారతదేశం విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి చెప్పారు. మనం పొరుగు దేశాలతో శాంతియుతంగా జీవించాలా? లేదా? ఒకరితో ఒకరు పోరాడాలా? అనే మన ఎంపిక అని అన్నారు.
న్యూయార్క్లో జరిగిన 77వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జిఎ) సమావేశంలో షాబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. 1947 నుండి ఇప్పటివరకూ ఇరుదేశాల మధ్య మూడు యుద్ధాలు జరిగాయనీ, ఫలితంగా రెండు వైపులా కష్టాలు, పేదరికం, నిరుద్యోగం మాత్రమే పెరిగాయని అన్నారు. ఇప్పుడు మన విభేదాలు, మన సమస్యలు, మన సమస్యలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మన చేతుల్లో ఉందని అన్నారు.
షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో వినాశకరమైన వరదల గురించి కూడా సభకు చెప్పారు. పాకిస్థాన్లో భారీ వరదల కారణంగా 400 మందికి పైగా చిన్నారులు సహా 1500 మంది మరణించారని ఆయన చెప్పారు. లక్షలాది మంది పాకిస్థానీయులు తమ ఆవాసాలను కోల్పోయారనీ, చాలా మంది గుడారాలు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు.
వరదల కారణంగా కోటి మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు పడిపోయారనీ పాకిస్థాన్ ప్రధాని అన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం ప్రపంచ నాయకులు కలసి రావాలన్నారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నిర్ధారించడం, లక్షలాది మంది ప్రజలను పేదరికం మరియు ఆకలి నుండి బయటపడేయడమే ప్రస్తుతం పాకిస్తాన్ తక్షణ ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
నివేదికల ప్రకారం.. పాకిస్తాన్లో వరదల కారణంగా సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్యసమితి, అధికారులు, భాగస్వాములతో కలిసి బాధిత జనాభాకు సహాయక సామగ్రిని అందజేస్తోంది. వరదల కారణంగా పాకిస్థాన్లో 7.6 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వీరిలో దాదాపు 600,000 మంది సహాయక కేంద్రాల్లో నివసిస్తున్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ తెలిపారు.