
Russia Ukraine Crisis: ఉక్రెయిన్-రష్యాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే మరింత దూకుడు పెంచిన రష్యా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తూర్పు ఉక్రెయిన్లోని ఒక పట్టణంపై రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో తాజాగా 21 మందికి పైగా పౌరులు మరణించారు. అలాగే, 25 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఖార్కివ్ నగరం వెలుపల ఉన్న మెరెఫా పట్టణంలోని పాఠశాల, సాంస్కృతిక కేంద్రాన్ని రష్యా బలగాలు టార్గెట్ గా ఫిరంగుల వర్షం కురిపించాయని తెలిపింది. 21 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు ఈ ఘటన కారణంగా గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందనీ, వారు ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాడుతున్నారని వైద్యులు తెలిపారు.
ఈ దాడి గురించి మెరెఫా మేయర్ వెనియామిన్ సిటోవ్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా, ఖార్కివ్ ప్రాంతం భారీ బాంబు దాడులను చవిచూసిందని తెలిపారు. ఇక్కడే నిలిచిపోయిన రష్యన్ దళాలు ఈ ప్రాంతంలో ముందుకు సాగడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే దాడులు జరిపాయని తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్కు ఈశాన్యంగా ఉన్న చెర్నిహివ్ నగరంలో, హాస్టల్పై మిస్సైల్ దాడి జరిగిందని, 3 ఏళ్ల కవలలతో సహా ఒక తల్లి, తండ్రి మరియు వారి ముగ్గురు పిల్లలు మరణించారని ఉక్రెయిన్ అత్యవసర సేవ విభాగం తెలిపింది.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన దాడులు గురువారం నాటికి నాల్గో వారంలోకి ప్రవేశించాయి. ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ దాడి ప్రారంభంలో అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ సైనిక స్థావరాల లక్ష్యంగానే మిలిటరీ చర్య కొనసాగుతుందని ప్రకటించారు. అయితే, ఆ తర్వాత రష్యన్ బలగాలు సాధారణ పౌరలు నివాసాలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే వేల మంది సాధారణ పౌరులు చనిపోయినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆర్థికంగా రెండు దేశాలకు భారీ నష్టం జరిగిందని సమాచారం.
అలాగే, ఉక్రెయిన్ పై మిస్సైల్ దాడులు, వైమానికి దాడుల కారణండా భారీ నష్టాలు మరియు విధ్వంసం సంభవించిందని ఉత్తర నగరమైన చెర్నిహివ్ గవర్నర్ చెప్పారు. ఈ దాడుల కారణంగా గత 24 గంటల్లో 53 మంది మృతదేహాలు నగరానికి చేరుకున్నాయని తెలిపారు. అంతకుముందు రోజు, వందలాది మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న మారియుపోల్లోని థియేటర్పై రష్యా వైమానిక దాడి జరిగింది. భవనం తాకిడికి తట్టుకోలేక పోయిందని, అయితే ప్రవేశ ద్వారం శిథిలాలతో మూసుకుపోయిందని, కొందరు తప్పించుకున్నారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ప్రాణనష్టం జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు.
అయితే, ఈ దాడులను విరమించుకోవాలని అంతర్జాతీయ సమాజం రష్యాపై ఆంక్షలను విధిస్తూ.. హెచ్చరిస్తున్నాయి. వీటిని లెక్కచేయని రష్యా.. దాడులను మరింతగా పెంచింది. దింతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లలోనే ప్రాణాలు కాపాడుకోవడానికి దారుణ పరిస్థితుల్లో నివాసముంటున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా రష్యాకు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ దాడులను ఆపాలని రష్యాకు న్యాయస్థానం సూచించింది.