
Russia Ukraine Crisis: మూడవ రోజు కూడా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగిస్తుంది. ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. ఉక్రెయిన్ పై రష్యన్ దళాలు విరుచుకపడుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. బాంబుల వర్షాన్ని కురుపిస్తున్నాయి. పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీని ఆక్రమించుకునేందుకు దూసుకెళ్తుంటే.. రష్యా బలగాలకు నిలువరించడానికి ఉక్రెయిన్ సైనికులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు. సైనిక దాడులు, బాంబుల దాడి మోత, వైమానిక దాడులు మోగుతున్న సైరన్లతో రాజధాని కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతుంది. యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచదేశాలు కోరుతున్నా..రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అమెరికా, అల్బేనియా దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టారు. మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా..ఉక్రెయిన్పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. భారత్, చైనా, యూఏఈ ఓటింగ్కు గైర్హాజరయ్యాయి. మొత్తం 15 దేశాలకు గానూ 11 అనుకూలంగా ఓటు వేసినా రష్యా తన వీటో అధికారంతో అడ్డుకుంది. వీటో అధికారాన్ని ఉపయోగించడంతో ఈ తీర్మానం చాలా ఈజీగా వీగిపోయింది.
అయితే.. ఈ ఓటింగ్కు భారత్ గైర్హజరు కావడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి TS తిరుమూర్తి.. తాను హాజరకాకపోవడానికి వివరణ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య వివాదాలు, భేదాభిప్రాయాలకు చర్చలే కేవలం పరిష్కారమని, ఇరు దేశాలూ దౌత్య మార్గాన్ని వదులుకోవడం విచారకరమని పేర్కోన్నారు. భారత్ రష్యాతో తిరిగి దౌత్య సంబందాలను కొనసాగించాలని భావిస్తుందనీ, ఈ కారణంగా భారతదేశం తీర్మానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలిపారు.
ఉక్రెయిన్లో ఇటీవలి పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది.. హింస, శత్రుత్వాల తక్షణ విరమణ కోసం అన్ని ప్రయత్నాలు చేయాలని భారత్ కోరుతుందని తెలిపారు. అన్ని సభ్య దేశాలు అంతర్జాతీయ చట్టం, ఐరాస చార్టర్ సూత్రాలను గౌరవించాలనీ, భారతదేశం తన స్థిరమైన, దృఢమైన, సమతుల్య స్థితిని కొనసాగించిందని ఆయన పేర్కొన్నారు.
అయితే, శివసేన నేత ప్రియాంక చతుర్వేది వంటి కొందరు ప్రతిపక్ష నాయకులు ఓటింగ్ను దాటవేయాలనే నిర్ణయాన్ని విమర్శించారు. భారత తొలి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆమె తన ట్వీట్లలో ప్రస్తావించారు. "యుద్ధానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండటం మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది, కానీ హింస, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మీ సూత్రాలను బలహీనపరుస్తుంది. రేపు చైనాకు వ్యతిరేకంగా మాకు మద్దతు లభించకపోవచ్చు. ఈ రోజు మనం చైనా వైపు నిలబడి, అది మన గురించి గొప్పగా మాట్లాడుతుంది. " అని ఆమె ట్విట్ చేసింది.
కానీ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి యుఎన్ మరియు ఇతర దేశాలు తగినంతగా చేయలేదని విమర్శించారు. రష్యా చర్యను ఖండిస్తూ తీర్మానం చేయడంతో పాటు.. ఉక్రెయిన్కు సహాయం చేయడంలో UN పాత్ర ఏమిటి? మిత్ర దేశాలు మద్దతు వ్యక్తం చేస్తున్నాయి కానీ ఉక్రెయిన్ను ఒంటరిగా విడిచిపెట్టి తమను తాము రక్షించుకోవడానికి పోరాటడం చేస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా తన ఆందోళన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ఇప్పుడు ఉక్రేనియన్ అధికారులను ఏదైనా సహాయం అడుగుతారని ప్రశ్నించారు.
భారత-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా కూడా ఉక్రెయిన్తో భారతదేశం నిలబడాలని కోరారు. “1962లో, అధ్యక్షుడు (జాన్ ఎఫ్) కెన్నెడీ చైనా దండయాత్రకు వ్యతిరేకంగా భారతదేశానికి అండగా నిలిచారు. చైనా ప్రస్తుత విస్తరణ ప్రణాళికలకు వ్యతిరేకంగా భారత్తో పాటు నిలబడేది రష్యా కాదు, అమెరికా మాత్రమే’’ అని ఖన్నా ట్వీట్ చేశారు. పుతిన్కు వ్యతిరేకంగా భారతదేశం నిలబడాల్సిన సమయమిదనీ. గైర్హాజరు కావడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
దశాబ్దాలుగా యూరప్ చూసిన అత్యంత దారుణమైన యుద్ధాల్లో ఉక్రెయిన్ యుద్ధం ఒకటి. దాదాపు 16,000 మంది భారతీయులు ఈ ఉద్రిక్తతల్లో చిక్కుకున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది.