
జకార్త : Indonesiaలో భారీ earthquake వచ్చింది. బుధవారం తెల్లవారుజామున కెపులవన్ బరత్ దయాలో భూప్రకంపనలు వచ్చాయని దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూరోపియన్- మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 127 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వచ్చాయని తెలిపింది. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించింది.
కాగా, అర్థరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు అన్నారు. కాగా జనవరి 19న కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. అమహైకి సమీపంలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో జావా ద్వీపంలో కూడా భూ కదలికలు సంభవించాయి.
ఇదిలా ఉండగా, జనవరి 18న అప్గనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు వణికి పోయారు. 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. పశ్చిమ ఆఫ్గన్లో చోటుచేసుకున్న వరుస భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ అఫ్గన్లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం వచ్చింది. బాద్గీస్ పశ్చిమ ప్రావిన్సులోని ఖాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ పేర్కొన్నారు.
మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనటట్లు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అయితే ప్రావిన్స్లోని ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించిందని కానీ అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సర్వారీ చెప్పుకొచ్చారు.
కాగా ఇప్పటికే అఫ్గనిస్తాన్ తీవ్ర విపత్తులో చిక్కుకుంది. గత ఏడాది ఆగష్టులో దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా భూకంపాలతో అఫ్గన్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు. ఇక తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత అఫ్గన్ ఎదుర్కొన్న తొలి ప్రకృతి విపత్తు ఇదే కావడం గమనార్హం.