వైద్యరంగంలో విశిష్ట సేవలందించిన ఇద్దరు వైద్యులను 2018 నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంత్సరానికి గానూ నోబెల్ అసెంబ్లీ పురస్కారాల ప్రకటన జాబితా చేపట్టింది. అందులో భాగంగా తొలిరోజు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
స్వీడన్: వైద్యరంగంలో విశిష్ట సేవలందించిన ఇద్దరు వైద్యులను 2018 నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంత్సరానికి గానూ నోబెల్ అసెంబ్లీ పురస్కారాల ప్రకటన జాబితా చేపట్టింది. అందులో భాగంగా తొలిరోజు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
అమెరికా, జపాన్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ను ప్రకటించింది. అమెరికాకు చెందిన జేమ్స్ పి అల్లిసన్, జపాన్ కు చెందిన తసుకు హోంజోలకు వైద్యరంగంలో నోబెల్ బహుమతి అందిస్తున్నట్లు నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది.
క్యాన్సర్ చికిత్స కోసం వైద్యులు చేసిన పరిశోధనలకు గానూ నోబెల్ బహుమతి ప్రకటించినట్లు స్పష్టం చేసింది. క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయపడుతుందని వైద్యులు తమ అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. నోబెల్ పురస్కారంతో పాటు 9 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల(7,80,000 పౌండ్లు) నగదు బహుమతిని కూడా వీరు అందుకోనున్నారు.
వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏటా నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. అలాగే నోబెల్ శాంతి పురస్కారం కూడా అందజేస్తారు. అయితే కొన్ని లైంగిక ఆరోపణల కారణాల వల్ల ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వడం లేదని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది.
ఇకపోతే భౌతిక శాస్త్రంలో మంగళవారం, రసాయన శాస్త్రంలో బుధవారం పురస్కారాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. అక్టోబరు 5 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాల విజేతలను వెల్లడించనున్నట్లు నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది.