అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం లేదని కామన్వెల్త్ ఆఫ్ డొమినికా స్పష్టం చేసింది. దావూద్ ఇబ్రహీంకు తమ దేశ పాస్పోర్ట్ కూడా లేదని ఆ దేశం అధికారిక ప్రకటన చేసింది
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం లేదని కామన్వెల్త్ ఆఫ్ డొమినికా స్పష్టం చేసింది. దావూద్ ఇబ్రహీంకు తమ దేశ పాస్పోర్ట్ కూడా లేదని ఆ దేశం అధికారిక ప్రకటన చేసింది.
దావూద్ డొమినికన్ పాస్పోర్ట్ కలిగి వున్నాడని వస్తోన్న వార్తలను ఆ దేశం ఖండించింది. అతనికి తమ దేశ పౌరసత్వం లేదని, అంతేకాకుండా పెట్టుబడుల కార్యక్రమాల పేరుతో కూడా దావూద్కు ఎలాంటి పౌరసత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది.
పౌరసత్వం జారీ చేసే క్రమంలో నిజాయితీతో కూడా నూతన విధానాలను అనుసరిస్తున్నామని పేర్కొంది. ఈ సమయంలో దావూద్ ఇబ్రహీం విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని డొమినికా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
కాగా దావూద్ ఇబ్రహీం పలు పేర్లతో వివిధ దేశాల పాస్పోర్టులను కలిగి వున్నారనే వార్తలు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా 1993 ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నట్లు ఇటీవలే ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్నో ఏళ్లుగా బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. ప్యారిస్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) జూన్ 2018లో విధించిన గ్రే లిస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాను 88 మంది నిషేధిత ఉగ్రవాద సంస్థలు, దాని అధినేతలపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో దావూద్ ఇబ్రహీం పేరును కూడా చేర్చించింది.