
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన ఇండియన్స్ను తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ నుంచి రోడ్డు మార్గంలో రోమేనియా రాజధాని బుకారెస్ట్కు చేరుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం బయలుదేరి వెళ్లింది. Air India AI-1943 ప్రత్యేక విమానం ముంబై నుంచి శనివారం తెల్లవారుజామున బయలుదేరిన విమానం కొద్దిసేపటి క్రితం బుకారెస్ట్లో ల్యాండ్ అయింది. ఇప్పటికే పలువురు భారత విద్యార్థులు రోడ్డు మార్గంలో ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న సంగతి తెలిసిందే. వారిని అక్కడి నుంచి బుకారెస్ట్ ఎయిర్పోర్ట్కు తరలించనున్నారు.
బుకారెస్ట్కు చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్.. ఈరోజు సాయంత్రం తిరిగి భారత్కు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా.. బుకారెస్ట్కు, హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్లకు మరిన్ని విమానాలను నడపనుంది.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉండిపోయిన దాదాపు 20 వేల మంది భారతీయులను స్వదేశానికి తరలించడం ఇబ్బందికరంగా మారింది. వీరిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నారు. ఇక, ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడానికి ముందు.. ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 22న ఉక్రెయిన్ రాజధాని కైవ్ నుంచి ప్రత్యేక విమానంలో 240 మందిని ఇండియన్స్ను స్వదేశానికి తరలించింది. ఫిబ్రవరి 24, ఫిబ్రవరి 26 తేదీల్లో కైవ్ నుంచి మరో రెండు విమానాలను నడపాలని భావించింది. అయితే యుద్దం ప్రారంభం కావడంతో ఆ ప్రణాళికలు నిలిచిపోయాయి.
ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు తమ పాస్పోర్ట్లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను వారి వెంట ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఇక, కీవ్ నుంచి రొమేనియన్ సరిహద్దు చెక్పాయింట్ మధ్య దూరం దాదాపు 600 కిలోమీటర్లు మరియు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి ఎనిమిదిన్నర గంటల నుండి 11 గంటల వరకు పడుతుందని భారతీయ విద్యార్థులు తెలిపారు. ఇక, బుకారెస్ట్ రొమేనియన్ సరిహద్దు చెక్పాయింట్ నుంచి బుకారెస్ట్ దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.. రోడ్డు మార్గంలో ఈ దూరాన్ని చేరుకోవడానికి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతుంది. మరోవైపు కైవ్ నుంచి హంగేరియన్ సరిహద్దు చెక్పాయింట్ మధ్య దూరం దాదాపు 820 కిలోమీటర్లు ఉంది.. దానిని రోడ్డు మార్గంలో కవర్ చేయడానికి 12-13 గంటలు పడుతుంది.
సరిహద్దులకు వెళ్లొద్దని కేంద్రం ప్రకటన..
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత పౌరులను తీసుకురావడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని భారత పౌరులకు సంబంధించి కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని భారతీయులు ఎలాంటి సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. ఉక్రెయిన్లోని భారతీయ పౌరులందరూ సరిహద్దు పోస్టుల వద్ద భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. వారికి సహాయం కోసం హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేయబడ్డాయనీ, దీని కోసం అధికారులను సంప్రదించాలని పేర్కొంది. భారత రాయబార కార్యాలయం, కైవ్ ఎమర్జెన్సీ నంబర్లును పేర్కొంటూ భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్లో తాజా ప్రకటనలో పేర్కొంది.