కాలిఫోర్నియా: తోటి ఉద్యోగులను కాల్చి చంపిన దుండగుడు,8మంది మృతి

By telugu news teamFirst Published May 27, 2021, 9:17 AM IST
Highlights

కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌ పట్టణంలో ఓ ఉద్యోగి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు తన తోటి ఉద్యోగులపైనే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌ పట్టణంలో ఓ ఉద్యోగి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని వ్యాలీ ట్రాన్స్‌ఫోర్ట్‌ అథారిటీ ఉద్యోగి 57 ఏళ్ల సామ్‌ కాసిడీగా గుర్తించారు.

అక్కడి సమయం ప్రకారం.. ఉదయం 6న్నర గంటల సమయంలో తేలికపాటి రైలు సౌకర్యం ఉన్న ట్రాన్సిట్​ కంట్రోల్ సెంటర్, రైళ్ల పార్కింగ్, మెయింటెనెన్స్ యార్డ్ వద్ద నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు  ఎందుకు కాల్పులు జరిపాడో అనేది ఇంకా తెలియలేదన్నారు. 

కాల్పుల్లో మరణించిన వారిలో నిందితుడితో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారని వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.కాల్పులు జరిపిన ఘటన ప్రాంతాన్ని పరిసర భవనాలను బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి. కాల్పులు జరిగే ముందు ఓ ఇంట్లో సంభవించిన అగ్నిప్రమాదంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!