హైదరాబాద్ లో వరద పరిస్థితిపై కేటీఆర్‌ సమీక్ష.. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు...

By AN TeluguFirst Published Oct 14, 2020, 12:25 PM IST
Highlights

బుధవారం ఉదయం మంత్రి కేటీఆర్‌  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తో పాటు పురపాలక శాఖ విభాగాల అధికారులతో నగరం‌లోని వరద పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు. 
 

బుధవారం ఉదయం మంత్రి కేటీఆర్‌  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌తో పాటు పురపాలక శాఖ విభాగాల అధికారులతో నగరం‌లోని వరద పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు. 

అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లందరూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాల్‌, కమ్యూనిటీ హాల్‌లకు తరలించాలని, వారికి అక్కడే ఆహారం, వైద్య సదుపాయం కల్పించాలని కేటీఆర్ ఆదేశించారు. మూసి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. 

ప్రస్తుత భారీ వర్షాలకు నగరంలో పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ పోల్స్ విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకోవాలన్నారు. నగర రోడ్లపైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్‌హోల్స్ ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలిని ఆదేశించారు. 

అధికారులు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలన్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం కార్యాలయాలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది. కాగా, ఆ రోజు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భాగ్యనగరం అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మూసి నది పొంగిపొర్లుతోంది. మూసి వరద ఉధృతికి పరీవాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతోంది. 

click me!