గ్రేటర్ ఎన్నికల వేళ రాజాసింగ్ ఇంట విషాదం... రోహిత్ సింగ్ ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Nov 23, 2020, 10:01 AM IST
Highlights

జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. 

హైదరాబాద్: బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే  అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

రోహిత్ సింగ్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బండి సంజయ్ నన్ను మోసం చేశాడు: రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

మరోవైపు తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద తాను ఆరోపణలు చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ తీరుతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరుగుతోందని, ఆయనను తక్షణమే పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసినట్లుగా ట్వీట్ రూపొందించి కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

దానిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా దాన్ని ఆయన అభివర్ణించారు. రాజాసింగ్ వాయిస్ ఉన్నట్లు భావిస్తున్న ఆడియో ఒకటి తీవ్ర కలకలం సృష్టించింది. 

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మీద రాజాసింగ్ ఆగ్రహంగా ఉన్నట్లు, బండి సంజయ్ తనకు అన్యాయం చేసినట్లు ఆడియోలో ఉంది. తన అనుచరులకు గన్ ఫౌండ్రీ, బేగంబాజరు సీట్లు అడిగితే ఇవ్వలేదని, 2018లో తన విజయానికి కృషి చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వలేకపోయానని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆడియోలో ఉంది. 

తన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, మూడో రోజుల తర్వాత జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తానని, బిజెపి రాష్ట్ర నేతల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని రాజాసింగ్ చెప్పినట్లు ఆడియోలో ఉంది. తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా బండి సంజయ్ తీరు సరిగా లేదని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఫొటో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. 
  

click me!