మహాలక్ష్మి పథకంతో మహిళలకు కలిగే ప్రయోజనాలు :
తెలంగాణ కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. వీటిని నమ్మిన తెలంగాణ సమాజం పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ ను ఓడించి రాష్ట్ర ఏర్పాటుతర్వాత మొదటిసారి కాంగ్రెస్ కు పట్టంగట్టింది. ఇలా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆరు గ్యారంటీ హామీలను నెరవేర్చే పనిలో పడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్కోటిగా హామీలను అమలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో కీలకమైన రెండు హామీలను తెలంగాణ మహిళలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థ టీజిఎస్ ఆర్టిసి లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నారు. కేవలం ఆదార్ కార్డు చూపించి ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు తెలంగాణ మహిళలు.
ఇక మరో ఇదే మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పై సబ్సిడి హామీని కూడా నెరవేరుస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ ధరపై రూ.500 సబ్సిడీ ఇస్తున్నారు. దీంతో చాలా తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ లభిస్తోంది... తద్వారా మహిళల వంటింటి ఖర్చు తగ్గింది.
మహాలక్ష్మి పథకంలో ఇక మిగిలిపోయింది నెలనెలా మహిళలకు రూ.2,500 హామీ. దీన్ని కూడా త్వరలోనే అమలుచేస్తామని...మహిళల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు పడతాయని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇది కూడా పూర్తయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకం పూర్తిగా అమలు అవుతున్నట్లే.