Mahalakshmi Scheme : తెలంగాణ ప్రభుత్వం ఈ మహిళా దినోత్సవం రోజున రాష్ట్రంలోని ఆడపడుచులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వచ్చే నెల మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు లబ్ది చేకూర్చే మరికొన్ని పథకాలను ప్రారంభించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైన హామీ మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం... దీన్ని మహిళా దినోత్సవం నుండి ప్రారంభించే అవకాశాలున్నాయి.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీపై స్పందించారు. త్వరలోనే తెలంగాణ ఆడబిడ్డల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని... ప్రతినెలా వారికి ఆర్థికసాయం చేస్తూ భరోసా కల్పిస్తామని ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చనే ప్రచారం జరుగుతోంది... ప్రభుత్వ వర్గాల నుండి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి.
ఫిబ్రవరిలోనే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది... మార్చి 3న ఫలితాలు వెలువడతాయి. ఓట్ల లెక్కింపుకు రెండు మూడ్రోజులు సమయం పట్టినా మార్చి 8 వరకు ఫలితాలు వెలువడతాయి... ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాబట్టి ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. మహిళా దినోత్సవం రోజు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభిస్తే బావుంటుందని రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.
మహాలక్ష్మి పథకంతో మహిళలకు కలిగే ప్రయోజనాలు :
తెలంగాణ కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. వీటిని నమ్మిన తెలంగాణ సమాజం పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ ను ఓడించి రాష్ట్ర ఏర్పాటుతర్వాత మొదటిసారి కాంగ్రెస్ కు పట్టంగట్టింది. ఇలా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆరు గ్యారంటీ హామీలను నెరవేర్చే పనిలో పడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒక్కోటిగా హామీలను అమలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో కీలకమైన రెండు హామీలను తెలంగాణ మహిళలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థ టీజిఎస్ ఆర్టిసి లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నారు. కేవలం ఆదార్ కార్డు చూపించి ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు తెలంగాణ మహిళలు.
ఇక మరో ఇదే మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పై సబ్సిడి హామీని కూడా నెరవేరుస్తోంది రేవంత్ సర్కార్. ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ ధరపై రూ.500 సబ్సిడీ ఇస్తున్నారు. దీంతో చాలా తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ లభిస్తోంది... తద్వారా మహిళల వంటింటి ఖర్చు తగ్గింది.
మహాలక్ష్మి పథకంలో ఇక మిగిలిపోయింది నెలనెలా మహిళలకు రూ.2,500 హామీ. దీన్ని కూడా త్వరలోనే అమలుచేస్తామని...మహిళల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు పడతాయని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఇది కూడా పూర్తయితే తెలంగాణలో మహాలక్ష్మి పథకం పూర్తిగా అమలు అవుతున్నట్లే.
డిల్లీలోనూ మార్చి 8 నుండే మహిళలకు రూ.2,500 :
తెలంగాణ మాదిరిగానే ఇటీవల దేశ రాజధాని న్యూడిల్లీలో అధికారాన్ని చేపట్టిన బిజెపి సర్కార్ కూడా మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని మార్చి 8న ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తే బావుంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిల్లీ సీఎం రేఖా గుప్తా భావిస్తున్నట్లు అర్థమవుతోంది.
కేవలం తెలంగాణ, డిల్లీలే కాదు చాలా రాష్ట్రాల్లో మహిళా సాధికారత కోసం ఇలాంటి పథకాలు అమలవుతున్నాయి. మహిళలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా ఓ కుటుంబం మొత్తానికి లబ్ది చేకూరుతుంది. అంతేకాదు మహిళలకు ఆర్థిక స్వేచ్చ, ఆత్మగౌరవం లభిస్తుంది. ఇలా మహిళలకు భరోసా కల్పించాలనే ఇలాంటి ఆర్థికసాయం పథకాలను అమలుచేస్తున్నాయి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు.