January 26 : భారత దేశానికి బ్రిటీష్ వాళ్ల నుండి స్వాతంత్య్రం వచ్చాక స్వయంపాలన ప్రారంభమైంది. కానీ అప్పటికప్పుడు స్వయంపాలన సాగించే అవకాశం మనకులేదు... బ్రిటీష్ పాలకుల చట్టాలు, నిబంధనలను అనుసరించాల్సి వచ్చింది. ఇలా స్వాతంత్య్రం వచ్చాకకూడా పరాయి పాలకుల చట్టాలనే వాడటం ఇష్టంలేని పాలకులు స్వయంగా రాజ్యాంగాన్ని రచించుకున్నారు. ఇలా మనదేశంలో రాజ్యాంగ పాలన మొదలయ్యింది... ఇందుకు గుర్తుగా 1950 నుండి ప్రతి జనవరి 26 న రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) జరుపుకుంటాం.
అయితే నిజానికి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. మరి ఆ రోజును కాకుండా జనవరి 26న గణతంత్ర వేడకను ఎందుకు జరుపుకుంటాం? అనే డౌట్ చాలామందిలో వుంది. కానీ ఇందుకు ఓ కారణం వుంది. అదేంటో తెలుసుకుందాం.
జనవరి 26 స్వాతంత్య్ర దినోత్సవం నుండి గణతంత్ర దినోత్సవంగా ఎలా మారింది...
భారత ప్రజల ఎన్నోరోజుల పోరాటఫలితం దేశానికి స్వాతంత్య్రం. బ్రిటీష్ పాలకులను ఎదిరించి స్వాతంత్య్రోధ్యమంలో పాల్గొని ఎందరో అమరులయ్యారు... ఇంకెందరో ఏళ్ళకు ఏళ్లు జైళ్లలో మగ్గారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఇంకెన్ని నిర్బంధాలు విధించిన భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్షను తగ్గించలేకపోయారు ఆంగ్లేయులు. దీంతో ఆగస్ 15, 1947 లో భారత్ కు స్వాతంత్య్రం ప్రకటించి వెళ్లిపోయారు.
అయితే స్వాతంత్య్రం రావడం బాగానే వుంది...ఇకపై దేశ పాలన ఎలా? మనకేమో పాలనా అనుభవం లేదాయే. ఇలా ఆనాటి పెద్దలు తర్జనభర్జన పడుతున్న సమయంలో తట్టిన ఆలోచనే రాజ్యాంగం. ప్రపంచంలోని అన్నిదేశాలు చట్టాలను పరిశీలించి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్చి పాలనా నియమనిబంధనలు కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు. 1946 నుండి 1949 వరకు సుదీర్ఘ కసరత్తు తర్వాత రాజ్యాంగ రూపకల్పన పూర్తయ్యింది.
ఇలా రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే పార్లమెంట్ ఆమోదించింది. అంటే నిజానికి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సింది నవంబర్ 26న... కానీ జనవరి 26కు ఓ చారిత్రక నేపథ్యంలో వుండటంతో ఆరోజు నుండే రాజ్యాంగ పాలనను ప్రారంభించారు మన పాలకులు.దీంతో రిపబ్లిక్ డే ను ఆరోజే జరుపుకోవడం జరుగుతోంది.
భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో అంటే 1929 లోనే బ్రిటీష్ సామ్రాజ్యం నుండి అన్నివిధాలుగా తెగతెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఇందులో భాగంగా ఆ ఏడాది లాహోర్ లో జరిగిన మీటింగ్ పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్య్రం) ను ప్రకటించుకున్నారు. అప్పుడే జాతీయ జెండాను ఎగరేసారు. ఈ క్రమంలో 1930 జనవరి 26 నుండి దేశ ప్రజలు కూడా జాతీయ జెండాలు ఎగరేసి స్వాతంత్య్ర దినోత్సంగా జరుపుకోవాలి తీర్మానించారు.
అయితే 1947, ఆగస్ట్ 15న భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు బ్రిటిషర్లు. దీంతో ఆరోజు స్వాతంత్య్ర దినోత్సవంగా మారింది. ఇక గతంలో స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొన్న జనవరి 26 గుర్తింపు కోల్పోయింది. కానీ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందినా చారిత్రక నేపథ్యం కారణంగా జనవరి 26ను రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా నిర్ణయించారు. అందువల్లే జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
భారత గణతంత్ర వేడుకలు ఎలా జరుగుతాయి :
1950 జనవరి 26న ప్రారంభమైన భారత గణతంత్ర వేడుకలు ప్రతిఏడాది జరుగుతున్నాయి. దేశమంతటా అత్యంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే గణతంత్ర పరేడ్ ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
స్వాతంత్య్ర దినోత్సవం రోజులు ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తే గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఇలా రాష్ట్రపతి జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత పరేడ్ ప్రారంభం అవుతుంది. దేశ సైనిక శక్తిని ప్రదర్శిస్తూ భారత సాయుధ దళాలు ఈ పరేడ్ చేపడతాయి... తద్వారా
మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతాయి. ఆ తర్వాత వివిధ శాఖలు, రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలు మన దేశం యొక్క విభిన్నతలో ఏకతను ప్రతిబింబిస్తాయి.
ఈ వేడుకలు దేశవ్యాప్తంగా సమానంగా జరుగుతాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. విద్యార్థులు నృత్యాలు, నాటకాలు, జాతీయ గీతాలాపనలు, స్వాతంత్ర్య పోరాట గాధలతో దేశభక్తిని చాటుతారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వేడుకలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కార్యక్రమాలు దేశం పట్ల ప్రతి పౌరుడిలో దేశభక్తిని ప్రేరేపిస్తాయి.
ఇక దేశ రాజధాని న్యూడిల్లీలో ఉదయం వేడుకల తర్వాత సాయంత్రం జరిగే లేజర్ షోలు, సంగీత కార్యక్రమాలు ప్రజల హృదయాలను ఆకట్టుకుంటాయి. దేశవ్యాప్తంగా ప్రజలు తమ దేశ పట్ల గౌరవం మరియు గర్వాన్ని వ్యక్తపరుస్తూ ఈ వేడుకల్లో పాల్గొంటారు.