సౌదీ బాట పడుతున్న అర్జెంటీనా సారథి.. మెస్సీకి భారీ ధర చెల్లించేందుకు సిద్ధమైన రెండు ఫ్రాంచైజీలు..

First Published Jan 16, 2023, 12:30 PM IST

Lionel Messi: కెరీర్ చరమాంకంలో   తన దేశానికి ప్రపంచకప్ అందించిన అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ.. తన  మిత్రుడు, పోర్చుగల్ సారథి రొనాల్డో  బాటలోనే నడుస్తున్నాడు. 

పోర్చుగల్ సారథి  క్రిస్టియానో రొనాల్డో బాటలోనే  మరో సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్ను సౌదీ అరేబియా మీద పడింది.    అర్జెంటీనా సారథిగా ఉన్న మెస్సీ.. త్వరలోనే సౌదీకి చెందిన  ఓ  లీగ్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నాడని సమాచారం.  

రొనాల్డోను అల్ నజర్ తరఫున ఆడనున్న విషయం తెలిసిందే.   రెండున్నరేండ్ల కాంట్రాక్టుకు గాను రొనాల్డో కు  500 మిలియన్ యూరోలు చెల్లించేందుకు అల్ నజర్  ఒప్పందం కుదుర్చుకుంది.   అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 4,400 కోట్ల వరకు రొనాల్డోకు దక్కనున్నాయి. 


రొనాల్డోను  అల్ నజర్ దక్కించుకోగా.. అతడి సమకాలీకుడైన మెస్సీని దక్కించుకునేందుకు  సౌదీ లోని రెండు ఫ్రాంచైజీలు కన్నేశాయి. అల్ నజర్ కు ప్రత్యర్థులుగా ఉన్న అల్ ఇత్తిహాద్, అల్ హిలాల్ లు మెస్సీ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తున్నది. 
 

మెస్సీ ప్రపంచకప్ ముగిసిన వెంటనే  యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా  తన  ఫ్రాంచైజీ పీఎస్జీ తరఫున ఆడుతున్నాడు.  పీఎస్జీతో అతడి ఒప్పందం ఈ  వేసవి వరకు ఉంది. అయితే మెస్సీ దానిని ఇంకా రెన్యూవల్ చేసుకోలేదు.  అతడు సౌదీలో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడని సమచారం. 

ప్రస్తుతం మెస్సీతో అల్ ఇత్తిహాద్, అల్ హిలాల్  జట్లు చర్చలు జరుపుతున్నాయి. మెస్సీ కోసం 300 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.  3 వేల కోట్లు) అయినా  చెల్లించడానికి ఈ రెండు ఫ్రాంచైజీలు సుముఖంగానే ఉన్నాయట.  అయితే ఈ  అమౌంట్ రెండేండ్లకా లేక ఒక్క ఏడాదికా అన్నది తేలాల్సి ఉంది. 
 

మెస్సీ గనక ఈ రెండింటిలో ఏదో ఒకదాంట్లో జాయిన్ అయితే మాత్రం  మళ్లీ సౌదీ లో రొనాల్డో - మెస్సీల మధ్య పోరు రసవత్తరమవుతుంది.   మెస్సీ  కూడా చేరితే  ఇక ఆ తర్వాత  యూరోపియన్, ఇంగ్లీష్ ప్రీమియర్ మాదిరిగా మధ్య ఆసియా లో  ఫుట్‌బాల్ కు  ప్రజాధరణ పెరగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. 

click me!